coronavirus: కరోనాపై ముందే అమెరికా ఐబీ అలర్ట్, చెప్పినా లెక్కచేయని డొనాల్డ్ ట్రంప్
కరోనా వైరస్ అగ్రరాజ్యం అమెరికాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. యూఎస్లో 7 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 35 మంది చనిపోయారు. దీంతో పెద్దన్న డొనాల్డ్ ట్రంప్ కూడా ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్కు సంబంధించి అమెరికా నిఘావర్గాలు ట్రంప్ను హెచ్చరించాయి. కానీ వారి మాటను లెక్కచేయకపోవడంతో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.
చైనాలోని వుహాన్లో కరోనా వైరస్ లక్షణాలు డిసెంబర్ నెలలో బయటపడిన సంగతి తెలిసిందే. వైరస్ ప్రమాదకరమని గుర్తించిన అమెరికా నిఘావర్గాలు అప్రమత్తమయ్యాయి. మరింత జాగ్రత్తగా ఉండాలని అధినేత ట్రంప్కు సూచించాయని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొన్నది. వైరస్ తీవ్రతను తగ్గించేందుకు చైనా ప్రయత్నిస్తుందని.. తగిన చర్యలు తీసుకోవాలని ట్రంప్ దృష్టికి తీసుకురాగా.. తేలికగా కొట్టిపారేశారని రిపోర్ట్ చేసింది.
కరోనా వైరస్ ఇంతింతై.. 160కి పైగా దేశాల్లో వ్యాపించి మృత్యు ఘంటికలు మోగిస్తోంది. వాస్తవానికి ట్రంప్.. ఐబీ అధికారులు చెప్పిన సమయంలో పరిస్థితి ఇలా ఉంటుందని ఊహించలేదు.. దీంతో అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనాతో చనిపోతున్నారు. వాషింగ్టన్ పోస్ట్ కథనంపై మీడియా ప్రతినిధులు వివరణ అడగగా 'సీఐఏ' నిరాకరించింది.
అమెరికా ప్రజల ఆరోగ్యం, భ్రత కోసం ట్రంప్ చారిత్రాత్మక చర్యలు తీసుకుంటున్నారని వైట్ హౌస్ అధికార ప్రతినిధి జుడ్ డీర్ తెలిపారు. కానీ మీడియో, డెమోక్రట్లు మాత్రం తమ ప్రభుత్వం చేసిన చర్యలను గాక.. అభిశంసన తీర్మానాలపై ఫోకస్ చేసిందని దుయ్యబట్టారు.