బిన్ లాడెన్పై దాడికి పదేళ్లు: జో బిడెన్ కీలక వ్యాఖ్యలు: వారి త్యాగాన్ని విస్మరించలేం
వాషింగ్టన్: భయానక ఉగ్రవాద సంస్థ అల్ఖైదా చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్పై అమెరికా సైనికులు జరిపిన దాడికి ఆదివారం నాటితో పదేళ్లు పూర్తయ్యాయి. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబోటాబాద్ నగర శివార్లలో ఓ బంగళాలో నివసిస్తోన్న లాడెన్ను 2011 మే 2వ తేదీన అమెరికా సైన్యానికి చెందిన నేవీ సీల్స్.. కాల్చి చంపింది. లాడెన్ మృతదేహాన్ని సముద్రంలో గుర్తు తెలియని ప్రదేశంలో ఖననం చేసింది.
లాడెన్ ఆచూకీని పసిగట్టడానికి రెండేళ్ల పాటు ప్రత్యేకం ఓ ఆపరేషన్ నిర్వహించింది అమెరికా. ఇందులో చాలామంది సైనికులు అమరులయ్యారు. ఈ ఆపరేషన్లో అమరులైన సైనికులకు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్.. తాజాగా నివాళి అర్పించారు. లాడెన్పై దాడికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా వైట్హౌస్ నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. లాడెన్పై చేపట్టిన ఆపరేషన్ విజయవంతం చేసే ప్రయత్నంలో పలువురు సైనికులు వీరమరణం పొందారని, వారి త్యాగాన్ని విస్మరించలేమని పేర్కొన్నారు.
అబోటాబాద్పై దాడి సమయంలో ఆయన అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈ ఆపరేషన్ మొత్తాన్నీ అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కలిసి ప్రత్యక్షంగా తిలకించారు. సైనికుల అసమాన పోరాటాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని బిడెన్ గుర్తు చేసుకున్నారు. న్యూయార్క్ ట్విన్ టవర్స్పై దాడికి కారణమైన బిన్ లాడెన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని తాము అప్పట్లో ప్రజలకు హామీ ఇచ్చామని, దాన్ని నెరవేర్చుకోవడానికి తీవ్రంగా శ్రమించామని చెప్పారు.
ఓ సుదీర్ఘమైన యుద్ధాన్ని ముగించామని, అల్ఖైదాకు పుట్టినిల్లుగా భావించే ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నామని చెప్పారు. అల్ఖైదా ఇఫ్పుడు పూర్తిగా అంతరించి పోయే దశకు చేరిందని చెప్పారు. అయినప్పటికీ- ఆ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలపై నిఘా కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని అణచివేయడానికి తాము కట్టుబడి ఉన్నామని బిడెన్ స్పష్టం చేశారు.