రష్యా పక్కలో బల్లెం: ఉక్రెయిన్ పొరుగుదేశంలో జో బైడెన్ మకాం
వాషింగ్టన్: రోజులు గడుస్తున్న కొద్దీ- రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న మరింత తీవ్రం అవుతోంది. యుద్ధాన్ని నిలిపివేయడానికి రెండు దేశాల ప్రతినిధులు శాంతి చర్చల్లో పాల్గొంటోన్నప్పటికీ.. అవి కొలిక్కి రావట్లేదు. డిమాండ్లను అంగీకరించే విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంటోంది. ఉక్రెయిన్పై రష్యా ఎప్పట్లాగే విరుచుకుపడుతోంది. దాదాపు అన్ని రీజియన్లపైనా పట్టు బిగించింది. తమ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని నగరాలనూ ఆధీనంలోకి తెచ్చుకుంది.
పుతిన్తో చర్చలకు సిద్ధం..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ముఖాముఖి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. అది విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని హెచ్చరించారు. పుతిన్తో చర్చల కోసం రెండు సంవత్సరాల నుంచీ ఎదురు చూస్తున్నానని వ్యాఖ్యానించారు. చర్చలకు ప్రత్యామ్నాయం మరొకటి లేదని, అవి సఫలమైతేనే గానీ యుద్ధం ముగియదని అన్నారు.
నాటోలో చేరబోమంటూ హామీ..
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో తాము చేరబోమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. నిజానికి- రష్యా ప్రధాన డిమాండ్ కూడా ఇదే. ఈ ఒక్క డిమాండ్కు అంగీకరిస్తే రష్యా యుద్ధాన్ని నిలిపివేస్తుందని భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. నాటోలో చేరబోమంటూ జెలెన్స్కీ చెప్పడాన్ని అంగీకరించట్లేదు. దీనికి లీగల్ గ్యారంటీ కావాలని పట్టుబడుతోంది. డొనాట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను ఇండిపెండెంట్ స్టేట్స్గా గుర్తించాలని పట్టుబట్టుతోంది.
ఉక్రెయిన్ పొరుగు దేశంలో..
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు. ఈ నెల 25వ తేదీన ఆయన స్వయంగా పోలాండ్కు బయలుదేరి వెళ్లనున్నారు. ఉక్రెయిన్కు ఆనుకునే ఉన్న దేశం ఇది. రష్యాపై ఆంక్షలను విధించిన దేశాల్లో ఇదీ ఒకటి. రాజధాని వార్సాలో ఆ దేశాధ్యక్షుడు ఆండ్ర్జెజ్తో జో బైడెన్ సమావేశమౌతారు. రష్యా దూకుడును అడ్డుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. అమెరికా, అమెరికాకు మద్దతు ఇస్తోన్న దేశాలు, యూరోపియన్ యూనియన్తో కలిసి- అనుసరించాల్సిన వ్యూహాల గురించి మాట్లాడతారు.
రష్యా పక్కలో బల్లెం..
ఉక్రెయిన్ పొరుగుదేశంలో జో బైడెన్ మకాం వేయడం అంటే రష్యా పక్కలో బల్లెంలా మారినట్టే అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉక్రెయిన్ సాగిస్తోన్న యుద్ధాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారని, ఈ విషయంలో ఉక్రెయిన్ సైన్యానికి దిశా నిర్దేశం చేస్తారనే వాదనలు వినిపిస్తోన్నాయి. పోలాండ్ పర్యటన ముగించుకున్న తరువాత ఆయన బెల్జియం బయలుదేరి వెళ్తారు. బ్రస్సెల్స్లో నిర్వహించబోయే యూరోపియన్ యూనియన్, నాటో అత్యున్నత స్థాయి సమ్మిట్లల్లో పాల్గొంటారు.
ఆ ప్రకటన తరువాతే..
నాటోలో చేరబోమంటూ జెలెన్స్కీ నుంచి ప్రకటన వెలువడిన తరువాత అమెరికా అప్రమత్తం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ జోక్యం చేసుకోనున్నారు. దీనికోసం ఆయన యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. రెండు కీలకమైన, అత్యున్నత స్థాయి సదస్సులకు ఆయన హాజరు కానున్నారు. అంతకుముందు నిర్ధారించిన షెడ్యూల్లో పోలాండ్ పర్యటన లేదు. ఆ తరువాత దీన్ని చేర్చారు.
ఆ రెండు రీజియన్లపైనా
డొనాట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను ఇండిపెండెంట్స్ స్టేట్స్గా గుర్తించాలనీ రష్యా డిమాండ్ చేస్తోంది. ఈ రెండు రీజియన్లు కూడా 2014 నుంచి రష్యన్ వేర్పాటువాదుల ఆధీనంలో ఉంటోన్నాయి. ఈ రెండు రీజియన్లపై ఉక్రెయిన్ ప్రభుత్వం తన అధికారాన్ని వెనక్కి తీసుకోవాలని రష్యా పట్టుబడుతోంది. యుద్ధం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- ఈ రెండు రీజియన్లను ఇండిపెండెంట్ స్టేట్స్గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.