అమెరికా చరిత్రలో మూడోసారి: సెనేట్లో ట్రంప్పై అభిశంసన తీర్మానం ప్రక్రియ ప్రారంభం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు సంబంధించి అభిశంసన తీర్మానం ప్రక్రియ సెనేట్లో ప్రారంభమైంది. అభిశంసన తీర్మానం సందర్భంగా సెనేట్లోని సభ్యులు పక్షపాతంతో వ్యవహరించబోమని ముందుగా జ్యూరీ ఎదుట ప్రమాణం చేశారు. చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలో అభిశంసన తీర్మానం ప్రక్రియ ప్రారంభమైంది. అమెరికా చరిత్రలో ఒక దేశాధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఇది మూడోసారి కావడం విశేషం. అమెరికా అధ్యక్షుడి ఎన్నికలకు మరికొన్ని నెలలు మాత్రమే సమయం ఉండటంతో ట్రంప్పై అభిశంసన తీర్మానం ఆసక్తికరంగా మారింది.

జస్టిస్ జాన్ రాబర్ట్స్ నేతృత్వంలో అభిశంసన తీర్మానం ప్రక్రియ
ఇక ట్రంప్పై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానంలో జడ్జీలుగా నలుగురు డెమొక్రటిక్ సభ్యులు ఉన్నారు. అభిశంసన తీర్మానం కోసం చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ సెనేట్కు చేరుకున్నారు. అనంతరం ఆయన ప్రక్రియను ప్రారంభించారు. సెనేటర్లు అంతా నిలబడి చేతులు ఎత్తి డొనాల్డ్ ట్రంప్ అభిశంసన తీర్మానం సందర్భంగా పక్షపాతంతో వ్యవహరించబోమని ప్రమాణం చేయాలని రాబర్ట్ కోరారు. రాజ్యాంగంకు, చట్టాలకు లోబడి వ్యవహరిస్తారా అని చీఫ్ జస్టిస్ అడుగగా అందుకు సభ్యులంతా తాము పక్షపాతంతో వ్యవహరించబోమని చెప్పి ప్రమాణస్వీకారం ఉన్న పుస్తకంలో సంతకాలు చేశారు.

రెండు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్
గత నెలలో ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఓటింగ్ జరిగింది. ట్రంప్ రెండు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధ్యక్ష పదవికి రేసులో ఉన్న జో బిడెన్పై విచారణ జరపాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకురావడం ఒకటైతే... తనపై విచారణ జరగకుండా కాంగ్రెస్ను అడ్డుకోవడం రెండోది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని కేవలం తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు డెమొక్రాట్లు దిగారని చెప్పారు. అభిశంసన తీర్మానంలో గట్టెక్కుతానన్న విశ్వాసంను ట్రంప్ వ్యక్తం చేశారు. సెనేట్లో మెజార్టీ సభ్యులు రిపబ్లికన్లు ఉండటంతో ట్రంప్ సులభంగా గట్టెక్కుతారనే పరిశీలకులు చెబుతున్నారు.

రాజకీయ కక్షసాధింపు చర్యే అన్న ట్రంప్
ఎలాంటి తప్పు చేయనప్పుడు ట్రంప్ విచారణను అడ్డుకునేందుకు ఎందుకు ప్రయత్నించారని డెమొక్రాట్ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు సాక్షాలున్నాయన్నారు డెమొక్రాట్ నేత చక్ షూమర్. తన వ్యక్తిగత లాభం కోసం మరో విదేశీనాయకుడిపై ఒత్తిడి తీసుకురావడం నేరమని చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరాలకు పాల్పడ్డారని, వ్యక్తిగత లాభాల కోసం పనిచేశారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు ఇంటెలిజెన్స్ కమిటీ అధికారి ఆడమ్ స్కిఫ్ 9పేజీల తీర్మానంను చదివి వినిపించారు.
మొత్తానికి ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై సెనేట్లో అభిశంసన తీర్మానం ప్రక్రియ ప్రారంభమైంది. అంతకుముందు 1999లో అప్పటి అధ్యక్షుడు బిల్క్లింటన్పై, 1868లో ఆండ్రూ జాన్సన్లపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిగా ఇద్దరూ గట్టెక్కారు. ట్రంప్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం ఇది మూడోసారి.












Click it and Unblock the Notifications