us polls విషాదం:కరోనా ముందు ఓడి.. ఎన్నికల్లో గెలిచిన నార్త్ డకోటా ట్రంప్ పార్టీ అభ్యర్థి
నార్త్ డకోటా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి లక్షలాది మంది ప్రాణాలు తీస్తోంది. అమెరికాలో కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. ఇప్పటికే రెండు లక్షలకుపైగా కరోనా బాధితులు మరణించారు. తాజాగా, అమెరికాలో ఎన్నికల సందర్భంగా ఓ రాజకీయ నేత మరణం విషాదాన్ని నింపింది. మరణాంతరం ఎన్నికల్లో గెలవడంతో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
యూఎస్ ఎన్నికల ఎఫెక్ట్: రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుదల. కోటికి చేరువలో!
నెల క్రితమే డేవిడ్ డీన్ మరణం..
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. కాగా, నార్త్ డకోటాలోని 8వ జిల్లాకు జరిగిన ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డేవిడ్ డీన్ అండహ్ల్ విజయం సాధించారు. అయితే, ఆయన నెల క్రితమే కరోనాతో మరణించడం గమనార్హం. 55ఏళ్ల డేవిడ్ అక్టోబర్ మొదటి వారంలో కరోనా సోకి ఆస్పత్రిలో చేరారు.
మరణించినా.. బ్యాలెట్పై డేవిడ్ డీన్ పేరు
డేవిడ్ పరిస్థితి విషమించడంతో అక్టోబర్ 6న ప్రాణాలు కోల్పోయారు. అయితే, డేవిడ్ మరణించినప్పటికీ.. ఆయన పేరును బ్యాలెట్ నుంచి తొలగించలేదు. నార్త్ డకోటాలో సెప్టెంబర్ 18 నుంచే ఎర్లీ మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రారంభమైంది. దీంతో డేవిడ్ పేరును తొలగించేందుకు వీలు పడలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.
డేవిడ్ డీన్కే పట్టం కట్టిన ఓటర్లు..
ఈ క్రమంలో తాజాగా వెలువడిన ఫలితాల్లో డేవిడ్ డీన్ 35 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. ఆయనతోపాటు మరో రిపబ్లికన్ అభ్యర్థి డేవిడ్ నెహ్రింగ్ కూడా 40.72 శాతం ఓట్లతో ఇక్కడ గెలుపొందారు. అంతేగాక, ఈ సంవత్సరం ప్రారంభంలో, అండహ్ల్ ప్రస్తుత ఉత్తర డకోటా ప్రతినిధి జెఫ్ డెల్జర్పై ప్రాధమిక ఎన్నికల్లో గెలిచారు. కాగా, ఎక్కువగా గ్రామీణ రాష్ట్రమైన ఉత్తర డకోటాలో 7,60,000 జనాభా ఉంది. దేశంలో అత్యధిక తలసరి కోవిడ్ -19 కేసు రేటు ఉంది. గత ఏడు రోజులలో 100,000 మందికి 150 కిగా కేసులను నమోదు చేసింది. కాగా, అమెరికాలో కరోనా బారిన పడినవారి సంఖ్య 94లక్షలకుపైగా ఉంది. మరణాల సంఖ్య 2 లక్షలా 30వేలుదాటాయి. ప్రస్తుతం జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్.. ట్రంప్ కంటే చాలా ముందంజలో ఉన్నారు. దాదాపు జో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.