భారత్లో విలయం, తలొగ్గిన బైడెన్ -అమెరికా నుంచి వేగంగా అదనపు సాయం -బ్లింకెన్ కీలక ప్రకటన
కరోనా విలయం తొలినాళ్లలో మందులు లేక విలవిల్లాడిన అమెరికాను భారత్ అన్ని విధాలుగా ఆదుకుంటే, ఇప్పుడు అగ్రరాజ్యం మాత్రం ఆ పని చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 'అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్..' అంటూ అమెరికా ఎన్నికల్లో భారత మోదీ అనవసర జోక్యం చేసుకోవడం వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయనేవారూ లేకపోలేదు. రాజకీయాలు ఎలా ఉన్నా విపత్కర పరిస్థితుల్లో మానవత్వం ప్రదర్శించాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ తలొగ్గక తప్పలేదు..

భారత్కు అమెరికా సాయం
కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అతి తీవ్రంగా కొనసాగుతోన్న ఇండియాకు అవసరమైన అదనపు సాయాన్ని శరవేగంగా అందించనున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వెల్లడించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇండియాకు సాయం చేయాలంటూ యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్తోపాటు అక్కడి చట్టసభల ప్రతినిధులు, ప్రముఖ ఇండియన్-అమెరికన్లు బైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లతోపాటు అవసరమైన ఇతర కొవిడ్ మందులను సరఫరా చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో బ్లింకెన్ తాజా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.

హృదయవిదారకం..
కొవిడ్-19 వల్ల భారత ప్రజలు పడుతున్న ఇబ్బందులు హృదయాన్ని కలచివేస్తోందని, మహమ్మారితో సతమవుతున్న భారత ప్రజలకు అండగా ఉంటామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. భారత ప్రభుత్వ అధికారులతో తాము సన్నిహితంగా పని చేస్తున్నామని, ఇండియాకు మరింత సాయం చేయడానికి 24 గంటలూ శ్రమిస్తున్నామన్నారు. భారతీయులకు, భారత దేశంలోని హెల్త్కేర్ హీరోలకు అదనపు సహకారాన్ని వేగంగా అందజేస్తామని ఆయన తెలిపారు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ జేక్ సలివన్ మాట్లాడుతూ, భారత దేశంలో కోవిడ్-19 మహమ్మారి తీవ్రంగా విరుచుపడటం కలచివేస్తోందన్నారు. ఈ మహమ్మారితో ధైర్యంగా పోరాడుతున్న భారతీయులకు మరిన్ని ఔషధాలు, పరికరాల సరఫరాలను వేగంగా, అతి త్వరలో అందజేస్తామన్నారు.

ముడిసరుకులపై ఇంకా మొండిపట్టు..
భారత్ లో ఉత్పత్తి అవుతోన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాల తయారీకి అవసరమైన ముడిసరుకుల ఎగుమతిని అమెరికా నిషేధించిన దరమిలా, ఎత్తివేత కోసం సీరం సంస్థ అభ్యర్థించినా బైడెన్ మనసు కరగలేదు. డోక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఉన్నందున మోదీ సైతం నేరుగా అమెరికాను సాయం అడిగే సాహసం చేయడంలేదు. దీంతో అమెరికాలోని భారత సంతతి ప్రముఖులే బైడెన్ పై ఒత్తిడి పెంచారు. అమెరికా స్టోరేజ్లో ఉన్న కోట్లాది ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లను ఇండియాకు ఇవ్వాలని యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్తోపాటు కాంగ్రెస్ సభ్యులు రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి బైడెన్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతానికి తక్షణ సాయంగా కొన్ని మందులు, పరికరాలు అందజేస్తామంటోన్న అమెరికా.. వ్యాక్సిన్ ముడిసరుకుల విషయంలో మాత్రం ఇంకా మొడపట్టును ప్రదర్శిస్తోంది.












Click it and Unblock the Notifications