ఇక నాకు ఈ పదవి ఎందుకు, రద్దు చేయిస్తా: జడ్జిపై ట్రంప్ అసహనం
సియాటిల్ జిల్లా కోర్టు ఇచ్చిన స్టే హాస్యాస్పదంగా ఉందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయిస్తామని స్పష్టం చేశారు.
వాషింగ్టన్: సియాటిల్ జిల్లా కోర్టు ఇచ్చిన స్టే హాస్యాస్పదంగా ఉందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయిస్తామని స్పష్టం చేశారు. సదరు న్యాయమూర్తి అభిప్రాయం హాస్యాస్పదంగా ఉందని, ఈ దేశ చట్టబద్ధ పాలనను దేశం వెలుపలికి తీసుకెళ్లేలా ఉందన్నారు.
భద్రతా కారణాల రీత్యా ఈ దేశంలోకి ఎవరిని అనుమతించాలని, ఎవరిని అనుమతించకూడదో మనం నిర్ణయించలేకపోతే పెద్ద ఇబ్బంది ఏర్పడుతుందన్నారు. ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు.
న్యాయమూర్తిపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. సదరు న్యాయమూర్తి దేశంపై కక్షకట్టిన ఉగ్రవాదులకు ద్వారాలు తెరిచారని ధ్వజమెత్తారు. ఈ నిర్ణయంతో వాళ్లంతా ఆనందంగా ఉంటారని, దేశంలోకి చొరబడతారన్నారు. ఎవరు రావాలో, ఎవరు రాకూడదో నిర్ణయించే అధికారం లేనప్పుడు అధ్యక్ష పదవి ఎందుకని కూడా అభిప్రాయపడ్డారు.
మరోవైపు, కోర్టు ఉత్తర్వులపై సాధ్యమైనంత త్వరగా న్యాయశాఖ చర్యలు చేపడుతుందని వైట్హౌస్ ప్రెస్ కార్యదర్శి సియాన్ స్పైసర్ తెలిపారు.
ఏడు ముస్లీం దేశాలపై విధించిన నిషేధాన్ని దేశవ్యాప్తంగా నిలుపుదల చేస్తూ సియాటెల్ ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసేందుకు ట్రంప్ నాయకత్వం సిద్ధమైంది. ఈ తీర్పు రద్దు చేయాలని కోరుతూ అమెరికా న్యాయశాఖ కోర్టును ఆశ్రయించింది.
ట్రంప్ సమర్థన
కాగా, ఇరాక్, సిరియా, ఇరాన్, యెమెన్, సుడాన్, లిబియా, సొమాలియా దేశాల నుంచి అమెరికాలోకి 90 రోజులపాటు వలసలను నిషేధిస్తూ జారీచేసిన ఉత్తర్వును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకుంటున్నారు.
అందుకే ఉత్తర్వులు
అమెరికాలోకి ప్రవేశించకుండా ఉగ్రవాదులను అడ్డుకునేందుకే ఈ ఉత్తర్వు ఇచ్చానని, అమెరికా ప్రజల భద్రత, స్వేచ్ఛ తన బాధ్యతని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన చెప్పారు. వారానికోసారి అధ్యక్షుడు చేసే ఈ ప్రసంగం తొలిసారిగా ఫేస్బుక్, యూట్యూబ్లలోనూ ప్రసారమైంది.
అమెరికాకు మేలు
ప్రతి విషయంలోనూ అమెరికా ఉద్యోగులు, కుటుంబాలకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ట్రంప్ తెలిపారు. చట్టాన్ని గౌరవించే ఈ దేశ ప్రజలకే తన తొలి ప్రాధాన్యమని, అమెరికన్ల భద్రత, ఉద్యోగాలు, వేతనాలే మా నిర్ణయాలను ప్రభావితం చేస్తాయన్నారు. జనవరిలో ప్రయివేటు రంగంలో కొత్తగా 2.37 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, ఇది అంచనాల కన్నా చాలా ఎక్కువని ట్రంప్ చెప్పారు.
నిరసనలు
మరోవైపు, ఇమ్మిగ్రేషన్ విధానంలో ట్రంప్ చేస్తున్న మార్పుల పైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శనివారం ఇండోనేషియా, ఫిలిప్సీన్లోని అమెరికా రాయబార కార్యాలయాల ముందు విద్యార్థులు ఆందోళన చేశారు. నో బ్యాన్.. నో వాల్ అని నినదించారు.
రద్దు చేసిన న్యాయమూర్తి
ముస్లింల ఆధిక్యత ఉన్న ఏడు దేశాల నుంచి వలసదారులను, ప్రయాణికులను అమెరికాలోకి ప్రవేశించకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధాన్ని ఆ దేశ న్యాయమూర్తి ఒకరు తాత్కాలికంగా నిలుపుదలలో ఉంచిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులు దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేశారు. చెల్లుబాటు అయ్యే వీసాలు కలిగిన వ్యక్తులెవరైనా ఇప్పుడు అమెరికాలోకి ప్రవేశించవచ్చని వారు తెలిపారు.
సియాటెల్ జడ్జి
వాషింగ్టన్ రాష్ట్ర అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గుసన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సియాటిల్ జిల్లా జడ్జి జేమ్స్ రాబర్ట్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ న్యాయమూర్తిని 2003లో నాటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యూ బుష్ నామినేట్ చేశారు. అటార్నీ జనరల్ బాబ్ ఫెర్గుసన్ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సియాటెల్ జడ్జి జేమ్స్ రాబర్టు ఉత్తర్వులు ఇచ్చారు.
హర్షం
ఈ పరిణామంపై అటార్నీ జనరల్ ఫెర్గుసన్ హర్షం వ్యక్తంచేశారు. నేడు రాజ్యాంగం గెలిచింది. ఎవరూ చట్టానికి అతీతులు కారని, అధ్యక్షుడైనా సరే చట్టానికి కట్టుబడాల్సిందేనని చెప్పారు. కోర్టు ఆదేశాలను కాంగ్రెస్ సభ్యురాలు, భారత అమెరికన్ ప్రమీలా జయపాల్ స్వాగతించారు.