తండ్రీకూతుళ్ల కర్కశం: మహిళ కిడ్నాప్, వారంపాటు కారులో తిప్పుతూ అత్యాచారం, కూతురు ఎదుటే.. ఎడారిలో..
వాషింగ్టన్: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను కిడ్నాప్ చేసిన తండ్రీ కూతుళ్లు ఆమె వద్ద ఉన్న డబ్బును, విలువైన వస్తువులను అపహరించారు. ఆ తర్వాత ఆమెను కారులో తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డారు. ఘోరానికి పాల్పడుతున్న తండ్రికి ఆ కూతురు కూడా సహకరించడం విచారకరం. సుమారు వారం రోజులపాటు ఆమెపై ఈ దారుణానికి పాల్పడిన అనంతరం ఆమెను ఎడారి ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.
ఇంటికి పిలిచి ఆమెను బంధించారు..
ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు వెళ్లడించారు. అమెరికాలోని లాస్వేగస్కు చెందిన 40ఏళ్ల మహిళను స్థానికంగా ఉండే 54ఏళ్ల స్టాన్లీ అల్ఫ్రెడ్ లాటన్), 22ఏళ్ల అతడి కూతురు నికోల్ లాటన్ పరిచయం చేసుకున్నారు. కొద్దిరోజులపాటు ఆమెతో స్నేహాన్ని నటించారు. ఈ క్రమంలో అక్టోబర్ 30న తమ ఇంటికి ఆహ్వానించిన తండ్రీకూతుళ్లు ఆమెను బంధించారు.
వారంపాటు కారులో తిప్పతూ ఘోరం..
ఆ మహిళ బ్యాగులో ఉన్న డబ్బులను, ఆమె వద్ద ఉన్న విలువైన వస్తువులను తీసుకుని శారీరకంగా, మానసికంగా హింసించారు. ఆ తర్వాత ఓ కారులో ఆమెను ఎక్కించి అనేక ప్రాంతాలు తిప్పారు. స్టాన్లీ బాధితురాలిపై కారులోనే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు ఎదురుగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు తండ్రి.
ఆహారం కూడా పెట్టకుండా.. ఎడారిలోపడేశారు..
తనను వదిలేయాలంటూ సదరు మహిళ ఎంత వేడుకున్నా.. కనికరించలేదు ఆ కర్కశపు తండ్రీకూతుళ్లు. వారంరోజులపాటు ఆమెకు ఆహారం కూడా పెట్టకుండా హింసించారు. ఈ క్రమంలో బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను లాస్ఏంజెల్స్ ఎడ్వర్డ్స్ ఎయిర్ఫోర్స్ బేస్ సమీపంలోని ఏడారి ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.
సైనికులు రాకపోయుంటే..
ఆమెను గుర్తించిన సైనికులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమె నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు పోలీసులు. స్టాన్లీ, అతడి కూతురు తుపాకీతో బెదిరించి వారం రోజులపాటు తనకు నరకం చూపించారని బాధితురాలు చెప్పినట్లు లాస్ఏంజెల్స్ కౌంటీ మేయర్ కెప్టెన్ హెర్నాండేజ్ తెలిపారు. సైనికులు చూడకపోతే బాధితురాలు చనిపోయేదని చెప్పారు.
రాష్ట్ర సరిహద్దులను దాటి..
బాధితురాలి ఆరోగ్యం మెరుగవడంతో ఇంటికి తరలించామని, ఆమె ప్రాణాలతో బయటపడటం అదృష్టమేనని హెర్నాండేజ్ తెలిపారు. కాగా, బాధితురాలి నుంచి సేకరించిన వాంగ్మూలంతో నిందులైన స్టాన్లీ, అతని కూతురు నికోల్లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. దోపిడీతోపాటు కిడ్నాప్, హత్యాయత్నం కేసులను నిందితులపై నమోదు చేశారు పోలీసులు. రాష్ట్ర సరిహద్దులను దాటి ఈ దారుణానికి పాల్పడటంతో ఫెడరల్ కోర్టు ఈ కేసును విచారించనుంది. పోలీసులతోపాటు కలిసి ఎఫ్బీఐ దర్యాప్తు జరుపుతోంది.