ఉక్రెయిన్తో యుద్ధంపై సంచలన ప్రకటన చేసిన వ్లాదిమిర్ పుతిన్..!!
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ మధ్య హోరాహోరీగా సాగుతోన్న యుద్ధం పతాకస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ వార్.. నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఢీ అంటే ఢీ అంటోన్నాయి.
పట్టు బిగించిన రష్యా..
ఇన్ని రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఉక్రెయిన్ ప్రతిఘటన..
రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. 11 నెలలుగా రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కొంటోంది. కొన్ని సందర్భాల్లో పైచేయిని సాధించింది కూడా. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రాజధాని కీవ్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం చుట్టుముట్టినప్పటికీ..వారిని వెనక్కి పంపించగలిగింది.
మంత్రి మరణంతో..
తాజాగా- కీవ్ శివార్లల్లో హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఉక్రెయిన్ మంత్రి డెనిస్ మొనాస్టిర్స్కీ, ఉప మంత్రి యెవ్హెన్ యెనిన్ మరణించారు. మరో 16 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. 25 మంది గాయపడ్డారు.
వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఉక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:20 నిమిషాలకు కీవ్ శివార్లలోని బ్రోవరీ టౌన్ లో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
యుద్ధం గెలవబోతోన్నాం..
ఈ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని త్వరలో గెలవబోతోన్నామని అన్నారు. విజయం ఖాయమైందని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని తేల్చి చెప్పారు.
ఇవ్వాళ సెయింట్ పీటర్స్ బర్గ్ లోని ఓ ఫ్యాక్టరీని సందర్శించారాయన. అక్కడి అధికారులు, కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. దేశ ప్రజల ఐక్యత, సంఘీభావం, సైనికుల అసమాన ధైర్య సాహసాల వల్ల త్వరలోనే అతి గొప్ప విజయాన్ని అందుకోబోతోన్నామని అన్నారు.