వీడియో: ఎంహెచ్17 కూల్చివేత: రష్యా క్షిపణితోనే దాడి
కీవ్/కౌలాలంపూర్: ఉక్రెయిన్-రష్యా సరిహద్దులో గురువారం ఉద్రవాదులు క్షిపణి దాడి చేసి మలేషియా విమానా(ఎంహెచ్17)న్ని పేల్చివేయడంతో.. విమానంలో ఉన్న మొత్తం 298 మంది దుర్మరణం పాలయ్యారు. వీరిలో 15 మంది విమాన సిబ్బంది కూడా ఉన్నారు. భారత కాలమానం ప్రకారం ఈ దుర్ఘటన గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలిసింది. గల్లంతైన మలేషియా విమానం ఎంహెచ్ 370 ఘటన మరువకముందే ఇలాంటి ఘటన జరగడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది.
తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో ఎంహెచ్ 17 మలేషియా విమానం కూలిపోయింది. గ్రాబోవో గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. విమానం శకలాలు దాదాపు 15 కిలోమీటర్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. విమానంలో ఉన్నవారిలో 298 మంది ప్రయాణికులతో పాటు 15 మంది విమాన సిబ్బంది కూడా మృత్యువాత పడ్డారు.
కాగా, రష్యా అనుకూల తిరుగుబాటుదారులకు నిలయమైన దోన్త్క్స్ అనే ప్రాంతంలో షాక్తార్స్క్ పట్టణ సమీపానికి చేరుకున్న తర్వాత విమానాన్ని క్షిపణితో దాడి చేసి కూల్చివేసినట్లు సమాచారం. ఈ దాడి ఉక్రెయిన్లోని రష్యన్ మద్దతుదారుల పనేనని ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేయడం సరికాదని రష్యన్ అనుకూల వర్గాలు పేర్కొంటున్నాయి.
మీరంటే మీరేనని..
కానీ ఉక్రెయిన్ దళాలే పేల్చేశాయని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు పేర్కొంటుండగా.. అది తిరుగుబాటుదారుల పనేనంటూ ఉక్రెయిన్ ఆరోపిస్తుంది. కాగా, ఘటన పట్ల ఉక్రెయిన్ ప్రభుత్వంపై పుతిన్ విమర్శలు గుప్పించారు. తూర్పు ఉక్రెయిన్ ఆ దేశ ప్రభుత్వం అశాంతిని నెలకొల్పుతోందని ఆరోపించారు. రష్యాలో తయారైన క్షిపణితోనే దాడి జరిగిందని వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.
<center><iframe width="100%" height="510" src="//www.youtube.com/embed/AQXaCqLOnTo" frameborder="0" allowfullscreen></iframe></center>
కాగా, ఈ ఘటనపై ఉక్రెయిన్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. విమానంలో ఉన్న వారంతా చనిపోయినట్లు ఉక్రెయిన్ వర్గాలు ప్రకటించాయి. ఉక్రెయిన్ అధికారులకు సహకరించాలని అమెరికా శ్వేత సౌధం తన దేశం అధికారులను ఆదేశించింది.
మలేషియా ప్రధాని దిగ్భ్రాంతి
ఈ ఏడాదిలో మరోసారి మలేషియా విషాదంలో మునిగిపోయిందని ఘటనపై స్పందిస్తూ.. మలేషియా ప్రధాని నజీబ్ రజక్ అన్నారు. క్షిపణి దాడి వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆయన అన్నారు. ప్రమాదానికి గురైన విమానం నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతర్జాతీయ సంస్థలు, దేశాలు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.