పిల్లలు, వృద్ధులే కాదు..యువతపైనా కరోనా పడగ: బలం పుంజుకుంటోన్న వైరస్: డబ్ల్యూహెచ్ వార్నింగ్
జెనీవా: ప్రపంచాన్ని వణికింపజేస్తోన్న కరోనా వైరస్ పట్ల ప్రపంచ ఆరోగ్యం సంస్థ తాజా హెచ్చరికలను జారీ చేసింది. కరోనా క్రమంగా బలం పుంజుకొంటున్నట్లు కనిపిస్తోందని తాము అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. పదేళ్ల లోపు పిల్లలు, వృద్ధులను మాత్రమే అధికంగా బలి తీసుకుంటుందంటూ తాము మొదట్లో అంచనా వేశామని, ఇప్పుడు దీనికి భిన్నంగా కరోనా వైరస్ ప్రభావం చూపుతోందని స్పష్టం చేసింది. తన పరిధిని విస్తరించుకోవడమే కాకుండా.. బలోపేతమౌతోందని వెల్లడించింది.

యువతపైనా పెను ప్రభావం..
యువతపైనా ప్రాణాంతక దాడి చేసేలా మారిందనే విషయం తమ అధ్యయనంలో తేలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అథనామ్ తెలిపారు. యువత కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూ వస్తున్నామని, ఇప్పుడూ అదే చెబుతున్నామని ఆయన అన్నారు. కరోనా వైరస్ బారి నుంచి యువత కూడా అజేయులు ఏమీ కాదని టెడ్రోస్ వెల్లడించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారి ప్రాణాలను బలి తీసుకుంటుందని, ఇప్పుడు ఈ వైరస్ యువతపైనా ప్రభావం చూపుతోందని అన్నారు.

రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నా..
పిల్లలు, వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, అందుకే కరోనా వైరస్ వారిని ఎక్కువగా బలి తీసుకుంటుందనేది ఎంత వాస్తవమో.. యువతీ యువకులపైనా అదే స్థాయిలో ప్రభావం చూపుతుందనేది అంతే వాస్తవమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ముందుజాగ్రత్త చర్యలను పాటించడం ద్వారా మాత్రమే ఈ వైరస్ బారి నుంచి తమను తాము కాపాడుకోవచ్చని చెప్పారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో.. అంతే జాగ్రత్తను యువత కూడా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. స్వీయ జాగ్రత్తలు తప్పవని పునరుద్ఘాటించారు.

వ్యాక్సిన్లో వారికే ప్రాధాన్యత..
కరోనా వ్యాక్సిప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేంత వరకూ ముందుజాగ్రత్త చర్యలు తప్పవని అన్నారు. వ్యాక్సిన్ అందజేయడంలో తొలి ప్రాధాన్యత అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికే ఇస్తామని అన్నారు. కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతున్న ప్రాంతాలు, మృత్యుముఖంలో ఉన్న వారికి వ్యాక్సిన్ను అందజేసేలా తమ ప్రాధాన్యతలు ఉంటాయని టెడ్రోస్ తెలిపారు. కరోనా వైరస్ విషయంలో ఇదివరకు తాము అనుసరించిన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కోటి 70 లక్షల మందికి పైగా ప్రభావితులు అయ్యారని చెప్పారు.
Recommended Video

కరోనా పెరగడానికి ఇదీ ఓ కారణం..
కొన్ని దేశాల్లో యువత కరోనా కాటుకు గురి అవుతున్నారని అన్నారు. వచ్చే మూడు నెలల కాలం పాటు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని టెడ్రోస్ అన్నారు. యువతకు కూడా కరోనా వైరస్ సోకుతుండటం వల్లే పాజిటివ్ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకుంటున్నట్లు అంచనా వేస్తున్నామని చెప్పారు. అదే రీతిలో మరణాల సంఖ్య పెరగడానికి ఇదీ ఒక కారణమౌతోందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications