మేం ఏం చేస్తున్నామో.. మాకు బాగా తెలుసు: ఉక్రెయిన్-రష్యా విషయంలో డచ్ రాయబారికి భారత్ కౌంటర్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం విషయంలో భారత్ అనుసరిస్తున్న తటస్ఠ వైఖరిని విమర్శిస్తూ నెదర్లాండ్స్ రాయబారి చేసిన వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితి(యూనైటెడ్ నేషన్స్)కి భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తామేం చేస్తున్నామో తమకు తెలుసని, తమకు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఉక్రెయిన్పై యుద్ధం కొసాగిస్తున్న రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ సభలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్మానాలపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంటూ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా సహా పలు దేశాలు విమర్శలు చేస్తున్నాయి. ఇటీవల యూకేకు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోమ్ కూడా భారత్ పై విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించారు.
ఐక్యరాజ్యసమితి విధి విధానాలను భారత్ గౌరవించాలి.. జనరల్ అసెంబ్లీలో ఓటింగ్కు దూరంగా ఉండకూడదు అంటూ కారెల్ వాన్ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ వ్యవహారంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం జరిగిన సమావేశంలో తిరుమూర్తి ఈ ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ డచ్ రాయబారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్కు ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, తాము ఏం చేస్తున్నామో తమకు తెలుసని స్పష్టం చేశారు. యూఎన్ విధానాలు, అంతర్జాతీయ చట్టాలను తాము గౌరవిస్తామని, అదే సమయంలో అన్ని దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతకు గౌరవిస్తామని పేర్కొన్నారు.
At the UN Security Council meeting on #Ukraine this afternoon, I made the following statement ⤵️ pic.twitter.com/1ZMrEOzADB
— PR/Amb T S Tirumurti (@ambtstirumurti) May 5, 2022
అంతేగాక, ఉక్రెయిన్పై రష్యా దండయాత్రపై భారత్ తన స్పష్టమైన వైఖరిని ఇప్పటికే పలుమార్లు వెల్లడించిందని తిరుమూర్తి తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు ప్రారంభించిననాటి నుంచి హింసను ఆపాలని, చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలని భారత్ ఆ రెండు దేశాలకు సూచిస్తోందని పేర్కొన్నారు. బుచాలో పౌరుల హత్యను భారత్ తీవ్రంగా ఖండించిందని గుర్తు చేశారు. దీనిపై అంతర్జాతీయ దర్యాప్తు జరపాలన్న అభ్యర్థనలను కూడా సమర్థించిందని చెప్పారు.