Coronavirus: కరోనా వైరస్ను కనుగొన్న డాక్టర్.. అదే వైరస్ బారిన పడి మృతి..!
బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్ను మొట్టమొదటిసారిగా గుర్తించిన డాక్టర్ ఆయన. పేరు లీ వెన్లియాంగ్. వయస్సు 34 సంవత్సరాలు. వృత్తి రీత్యా కంటి వైద్య నిపుణుడు. కరోనా అనే వైరస్ పురుడు పోసుకుందనే విషయాన్ని గుర్తించింది ఆయనే. ఇప్పుడు ఆయననే బలి తీసుకుంది కరోనా వైరస్. ఈ వైరస్ బారిన పడి లీ వెన్లియాంగ్ మరణించినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. చైనాలోని వుహాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని పేర్కొంది.

తొలిసారిగా వుయ్ ఛాట్ ద్వారా..
గత ఏడాది డిసెంబర్లో కరోనా వైరస్ను గుర్తించారాయన. ఎస్ఏఆర్ఎస్ తరహా వైరస్ విజృంభిస్తోందని ఆయన తొలిసారిగా తాను చదువుకున్న మెడికల్ స్కూల్ ఆలమ్నీ జర్నల్లో రాశారు. ఇదే విషయాన్ని వుయ్ చాట్ ద్వారా కొన్ని మెడికల్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. తాను పనిచేస్తోన్న ఆసుపత్రిలో చేరిన ఏడుమంది రోగులను పరిశీలించిన తరువాత ఈ విషయాన్ని తాను ధృవీకరించినట్లు లీ వెన్లియాంగ్ ఈ జర్నల్లో పేర్కొన్నారు.

తప్పుడు సమాచారమంటూ అరెస్టు..
ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి లీ వెన్లియాంగ్ తప్పుడు సమాచారాన్ని సృష్టించాడనే కారణంతో ఆయనను వుహాన్ పోలీసులు అరెస్టు చేయడం ట్విస్ట్. ప్రజారోగ్యంపై సోషల్ మీడియా ద్వారా వదంతులను వ్యాపింపజేస్తున్నారంటూ పోలీసులు వెన్లియాంగ్పై కేసు నమోదు చేశారు. ఆ తరువాత నిజం తెలిసి ఆయనను వదిలి వేశారు. ఈ నెల 12వ తేదీన అనారోగ్యానికి గురయ్యారు వెన్లియాంగ్. ఆయనను పరీక్షించగా.. కరోనా వైరస్ పాజిటీవ్గా తేలింది. కరోనా వైరస్ సోకిన విషయాన్ని ఈ నెల 1న ధృవీకరించారు.

గర్భంతో ఉన్న ఐసీయులో ఉన్న భార్య..
వెన్లియాంగ్ భార్య గర్భంతో ఉన్నారు. ప్రస్తుతం ఆమె వుహాన్లోనే చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించగా నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. అదే సమయంలో- భర్త మరణించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. వెన్లియాంగ్, ఆయన భార్య తల్లిదండ్రులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారికి సంబందధించిన రిపోర్ట్ ఇంకా అందాల్సి ఉంది. కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని తమ కుమారుడు ముందుగానే గుర్తించాడని, అయినప్పటికీ..అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేకపోయారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

28 వేల మందికి పైగా..
ఇదిలావుండగా.. చైనా వ్యాప్తంగా 28 వేల మందికి పైగా కరోనా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన వారికి పరీక్షలను నిర్వహిస్తున్నారు. వాటి నివేదికలు ఇంకా అందాల్సి ఉంది. చైనాలో కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్యకు అడ్డుకట్ట పడట్లేదు. గురువారం నాటికి 580 మంది మరణించినట్లు చైనా జాతీయ హెల్త్ కమిషన్ వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.












Click it and Unblock the Notifications