కట్టడి చేయండి: కరోనా మహమ్మారి కేసుల పెరుగుదలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు మరోమారు భారీగా పెరుగుతండటం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. గత రెండు నెలల్లో ఓ వారంలో నమోదవుతున్న కేసుల సంఖ్య రెట్టింపు అయిందని తెలిపింది. ఈ నేపథ్యంలో కరోనావైరస్ కట్టడికి చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని ప్రపంచ దేశాలకు సూచించింది.
కరోనా మహమ్మారి ప్రారంభమైననాటి నుంచి ఇప్పటి వరకు నమోదుకాని విధంగా వైరస్ గరిష్ట స్థాయి వైపు దూసుకెళుతోందని, ఇంతకుముందు వైరస్ వ్యాప్తిని కట్టడి చేసిన దేశాల్లోనూ ఈసారి విపరీతంగా వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనమ్ గెబ్రెయేసన్ తెలిపారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ఆందోళన కరంగా ఉందన్నారు.
కరోనా ధాటికి అన్ని దేశాలు కూడా ఆత్యంత ప్రమాద స్థితిలోకి నెట్టివేయబడుున్నాయని టెడ్రోస్ అన్నారు. ప్రత్యేకంగా భారతదేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ దఫా కొత్త రకాలు వెలుగుచూస్తున్నప్పటికీ.. వైరస్ కట్టడి తీసుకునే చర్యలు ఒకేలా ఉంటాయన్నారు.
ప్రధానంగా టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, ఐసోలేషన్, చికిత్సతోపాటు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది. కాగా, డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలో చేపడుతున్న కోవాక్స్ కార్యక్రమం ద్వారా పేద, మధ్య తరగతి దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు 100కుపైగా దేశాలకు దాదాపు 4 కోట్ల వ్యాక్సిన్ డోలసును సరఫరా చేసింది. ప్రస్తుతం 154 దేశాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇప్పటి వరకు 84 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు సమాచారం.