WHO వల్లే కరోనా విలయం తీవ్రతరం -ముందే ఎమర్జెన్సీ పెట్టుంటే తీవ్రత తగ్గేది: గ్లోబల్ నిపుణుల ఫైర్
ఏడాదిన్నరగా భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ ఇప్పటికే 33.4లక్షల మందిని బలితీసుకుంది. బుధవారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 16కోట్లు దాటింది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) సమయానుకూలంగా వ్యవహరించి ఉండుంటే ఈ విపత్తు ఇంతటి తీవ్రస్థాయిలో ఉండేదికాదని అంతర్జాతీయ నిపుణుల బృందం అభిప్రాయపడింది.
Recommended Video
కరోనాను ఎదుర్కొనే విషయంలో డబ్ల్యూహెచ్ఓ తొలి నుంచీ తీసుకున్న పేలవమైన నిర్ణయాల వల్లే ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని కొవిడ్ సంసిద్ధతపై ఏర్పడిన అంతర్జాతీయ నిపుణుల బృందం పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు నివారించడానికి ఓ 'అంతర్జాతీయ అప్రమత్త వ్యవస్థ' అవసరమని 'కొవిడ్-19: మేక్ ఇట్ ఇన్ ది లాస్ట్ పాండమిక్' పేరుతో రూపొందించిన నివేదిక సూచించింది.

కరోనా మహమ్మారిని అత్యవసర స్థితిని ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆలస్యం చేసిందన్న నిపుణుల బృందం.. WHOలో సమూల సంస్కరణలు అవసరమని అభిప్రాయపడింది. 2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ వెలుగులోకి రాగా, దానిపై అత్యవసరంగా స్పందించడంలో, ఇతర దేశాలను హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్ఓ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, ఫిబ్రవరి 2020నాటికి గానూ ఎమర్జెన్సీ ప్రకటించడంతో వైరస్ కట్టడికి విలువైన కాలాన్ని ప్రపంచదేశాలు కోల్పోయాయని 'ది ఇండిపెండెంట్ ప్యానెల్ ఫర్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ అండ్ రెస్పాన్స్ (ఐపీపీపీఆర్)'తన నివేదికలో పేర్కొంది.
ప్రజలను రక్షించుకోవడంలో వ్యవస్థలు విఫలమవడంతో పాటు సైన్స్ను తిరస్కరించే నాయకులు ఆరోగ్య వ్యవస్థలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని అని ఐపీపీపీఆర్ తన నివేదికలో అభిప్రాయపడింది. ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడాలంటే మాత్రం ధనిక దేశాలు వంద కోట్ల వ్యాక్సిన్ డోసులను పేద దేశాలకు అందించాలని సూచించింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎదురయ్యే ఇలాంటి మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఓ నూతన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ధనిక దేశాలకు పిలుపునిచ్చింది. ఈ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా డబ్ల్యూహెచ్ఓ వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని సూచించింది. ఇలాంటి విపత్కర సందర్భంలో డబ్ల్యూహెచ్ఓ నాయకత్వంతో పాటు సిబ్బంది చేస్తున్న కృషిని నిపుణుల బృందం ప్రశంసించింది.
కొవిడ్ సంసిద్ధతపై ఏర్పడిన అంతర్జాతీయ నిపుణుల బృందానికి న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియా మాజీ అధ్యక్షుడు (2011 నోబెల్ బహుమతి గ్రహీత) ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్ అధ్యక్షత వహిస్తున్నారు. గతేడాది ఏర్పాటైన ఈ బృందం.. మహమ్మారిని ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన చర్యలు, జీ7, జీ20 దేశాల మద్దతు, పేద దేశాలకు వ్యాక్సిన్ల సరఫరా, వ్యాక్సిన్ తయారీ సంస్థలకు నిధులు, సాంకేతికత బదలాయింపు వంటి సూచనలతో కూడిన తుది నివేదికను తాజాగా విడుదల చేసింది.












Click it and Unblock the Notifications