ఆ వ్యాక్సిన్తో ప్లేట్లెట్స్ పడిపోయి, రక్తం గడ్డలు -కెనడాలో ఆస్ట్రాజెనెకా నిలిపివేత -55ఏళ్లలోపు వారికే
భారత్ నుంచి టీకాలు పొంది, మన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ హోర్డింగ్స్ కూడా వెలసిన కెనడాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రఖ్యాత ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ల వాడకాన్ని కెనడా తాత్కాలికంగా నిలిపేసింది. 55 ఏళ్లలోపు వయసున్న వ్యక్తులెవరికీ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వరాదని రోగనిరోధకతపై జాతీయ సలహా కమిటీ (ఎన్ఏసీఐ) సిఫార్సు చేయడంతో కెనడా ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
తిరుపతి పోరు: పవన్ ఎంట్రీ ఖరారు -రత్నప్రభ కోసం ఏప్రిల్ 3న జనసేనాని పాదయాత్ర -బీజేపీలో ఫుల్ జోష్
టీకాతో ప్రతికూలతలు
ఆస్ట్రాజెనెకా టీకాలు వేసుకున్నవారిలో ప్రతికూలతలు ఏర్పడుతున్నాయని, వాటిని పరిశోధించి, పరిష్కరించేంత వరకు 55 ఏళ్లలోపు వారికి సదరు టీకాలను ఇవ్వరాదని ఎన్ఏసీఐ పేర్కొంది. అయితే, 55 ఏళ్లు పైబడినవారిలో ఆస్ట్రాజెనెకా వల్ల ప్రతికూల లక్షణాలేవీ లేనందున ఆ వయసులవారికి టీకాల పంపిణీ నిరభ్యంతరంగా కొనసాగించవచ్చుని కమిటీ తెలిపింది.
మళ్లీ నిలిపివేతతో చర్చ..
ఇప్పటికే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకంపై యూరప్ దేశాల్లో అనుమానాలు రేకెత్తడం, ఈ టీకాను తీసుకున్నవారిలో రక్తం గడ్డకడుతోందని, అలా ఆస్ట్రియాకు చెందిన ఓ నర్సు ప్రాణాలు కోల్పోయిందని వార్తలు రావడంతో డనజుకుపైగా దేశాలు ఆస్ట్రాజెనెకా వాడకాన్ని తాత్కాలికంగా నిలిపేయడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగి.. వ్యాక్సిన్ల సేఫ్టీపై భరోసా ఇవ్వడంతో మళ్లీ పంపిణీ పున:ప్రారంభం కావడం తెలిసిందే. ఇక అనుమానాలన్నీ తీరాయనుకుంటున్న సమయంలో కెనడాలో ఆస్ట్రాజెనెకా, అది కూడా 55 ఏళ్లలోపు వారికి నిలిపేయడం చర్చకు దారితీసింది.
అసలు కారణం ఇదే..
వ్యాక్సిన్ ద్వారా బలహీనపడ్డ లేదా మృత వ్యాధికారక బ్యాక్టీరియాను వ్యక్తి శరీరంలోకి ప్రవేశపెడతారు. ఇవి మానవ శరీరంలోని తెల్లరక్తకణాలు ప్రేరేపితం చేసి, వ్యాధిపై పోరాడేందుకు యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. అయితే ఈ ప్రక్రియలో రక్తంలోని ప్లేట్ లెట్స్ ప్రభావానికి గురై, ప్లేట్ లెట్స్ సంఖ్య సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోవడం, తద్వారా రక్తం గడ్డకడుతోండటాన్ని గుర్తించామని, వైద్య పరిభాషలో దీనిని వ్యాక్సిన్-ప్రేరిత ప్రోథ్రాంబోటిక్ ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా (వీఐపీఐటీ)గా పిలుస్తామని, దీనిపై లోతైన అధ్యయనం, వివరాలు పూర్తయ్యేదాకా 55 ఏళ్లలోపు వ్యక్తులకు ఆస్ట్రాజెనెకా టీకాలు వేయొద్దని సూచించామని కమిటీ పేర్కొంది.
భారత్లో ఆ టీకాలు సేఫ్
కెనడాలో 55ఏళ్ల లోపు వారికి ఆస్ట్రాజెనెకా టీకాల పంపిణీ నిలిపివేత తాత్కాలికమే అంటోన్న అధికారులు, త్వరలోనే తదుపరి ఆదేశాలిస్తామని చెబుతున్నారు. ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ టీకా తాజాగా వెలువరించిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ వివరాల్లో దీని సమర్థత 79 శాతంగా నిర్ధారణ అయింది. తీవ్రమైన లేదా క్లిష్టమైన కొవిడ్-19 కేసుల్లోనైతే ఈ టీకా సమర్థత 100 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. భారత్ కు సంబంధించి ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ సంస్థలు సీరం ఫార్మాతో కలిసి 'కొవిషీల్డ్' పేరుతో వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చాయి. కొవిషీల్డ్ తోపాటు భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ ను కేంద్రం అత్యవసర వినియోగానికి వాడుతున్నది. యూరప్ దేశాలు, కెనడాలాగా భారత్ లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పై ఎలాంటి ప్రతికూలతలు కనిపించలేదని, ఈ రెండు టీకాలు సురక్షితమైనవని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది.
ఆకు రౌడీలు.. లాఠీలతో భయపెట్టలేరు -ఏసుక్రీస్తుకు యూదా, కేరళకు విజయన్ ద్రోహం -ప్రధాని మోదీ సంచలనం