డబ్బులు చెల్లిస్తా మహాప్రభో అంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు: ప్రధానికి మాల్యా సూటి ప్రశ్న
తను బ్యాంకులకు డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ బ్యాంకులను డబ్బులు స్వీకరించాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు ఆదేశించడంలేదని రివర్స్ అటాక్కు దిగాడు ఆర్థిక నేరగాడైన విజయ్ మాల్యా. తన ట్వీట్స్తో ప్రధానికే నేరుగా ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభ సమావేశాలు చివరిరోజున ప్రసంగిస్తూ మాల్యా ప్రస్తావన తీసుకొచ్చారు. దీంతో మాల్యా ట్వీట్ల ద్వారా ఎదురు ప్రశ్నలు వేశారు.
నేను డబ్బులు చెల్లించేందుకు రెడీ
"ప్రధాని నరేంద్ర మోడీ లోక్సభలో చేసిన ప్రసంగం నా దృష్టికి వచ్చింది. మోడీ మంచి వక్త అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నా పేరును ప్రస్తావించకుండానే రూ.9వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి దేశం వదిలి పారిపోయారని చెప్పినట్లు తెలిసింది. అయితే మోడీ తన గురించే చెప్పాడనే విషయం అందరికి తెలుసు. " అని మాల్యా ట్వీట్ చేశారు. " డబ్బులు చెల్లించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అయితే బ్యాంకులు ఆ డబ్బులు తీసుకోవాలని మోడీ ఎందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు. డబ్బులు రాబట్టాడనే మంచి మోడీకి వస్తుంది కదా." అని మరో ట్వీట్ చేశాడు మాల్యా.
కర్నాటక హైకోర్టు ముందే సెటిల్ చేస్తాను
"కర్నాటక హైకోర్టు ముందు అన్నీ సెటిల్ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. దీన్ని కొట్టిపారేయలేరు. కోర్టుముందు తేల్చుకోవడం అనేది తప్పు కాదు. కోర్టుపై గౌరవంతో , నిజాయితీతో చెప్పిన మాటలు. నేను అన్నీ కోర్టుముందే తేల్చుకుంటాను అని చెబుతుంటే ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడంలేదు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్కు సంబంధించి నేను తీసుకున్న రుణాలు తిరిగి చెల్లిస్తున్నప్పుడు బ్యాంకులు ఎందుకు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు" అని మాల్యా ప్రశ్నించారు.
మీడియా వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తోంది
"నేను నా ఆస్తులను దాచుకున్నానని మీడియానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్కు చెప్పింది. నిజంగానే ఆస్తులను దాచుకుని ఉంటే.. రూ.14వేల కోట్లు కోర్టు టేబుల్ ముందు ఎలా ఉంచుతానో చెప్పాలి. మీడియా చేస్తున్న పని సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తోంది. అయినా ఇది ముందే ఊహించాను " అని మాల్యా మరో ట్వీట్ ద్వారా విమర్శలు గుప్పించాడు.
ఇదిలా ఉంటే ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించబడిన వ్యక్తుల్లో మాల్యా మొదటి వ్యక్తి. ఆగష్టు 2018లో వచ్చిన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద ఆయన్ను నేరస్తుడిగా ప్రకటించడం జరిగింది. పలు బ్యాంకుల దగ్గర రూ.9వేల కోట్లు తీసుకుని 2016 మార్చి 2న మాల్యా దేశం విడిచి లండన్ పారిపోయాడు. డిసెంబరు 10, 2018లో భారత్కు అప్పగించాలని లండన్ కోర్టు వెల్లడించింది. మరోవైపు కోర్టు ఆదేశాల మేరకు మాల్యాను భారత్కు అప్పగించడంపై యూకే హోమ్ సెక్రటరీ ఆమోదం తెలిపారు. దీంతో మాల్యాకు పెద్ద షాక్ ఇచ్చినట్లయ్యింది. అదే సమయంలో మాల్యాను భారత్కు రప్పించడంపై భారత ప్రభుత్వం కూడా కొంత వరకు సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.