కాశ్మీర్ లేకుండా భారత్తో చర్చలుండవు: పాక్
ఇస్లామాబాద్: కాశ్మీర్ అంశం ఎజెండాలో లేకుండా భారతదేశంతో చర్చలను ప్రారంభించబోమని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఇరు దేశాలు శాంతి చర్చలను కొనసాగించాలని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సూచించిన నేపథ్యంలో పాకిస్తాన్ మంగళవారంనాడు ఆ విధంగా ప్రతిస్పందించింది.
వ్యూహాత్మక ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా జరిగిన చర్చల అనంతరం జాన్ కెర్రీ, పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. నిరుడు కాశ్మీరీ నేతలతో తలపెట్టిన సమావేశం రద్దు కావడాన్ని బట్టి భారత్ కాశ్మీర్పై చర్చించడానికి సిద్ధంగా లేదని అర్థమవుతోందని అజీజ్ అన్నారు. కాశ్మీర్ అంశం లేకుండా తాము భారత్తో చర్చలు ప్రారంభించలేమని అన్నారు.
సమస్య పరిష్కారానికి చర్చలు సాగించి ముందుకు సాగాలని తాము ఇరు దేశాలకు సూచిస్తూ అందుకు ప్రోత్సహిస్తుంటామని జాన్ కెర్రీ చెప్పారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో నెలకొంటున్న ఉద్రిక్తతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సరిహద్దు వెంబడి, నియంత్రణ రేఖ వెంబడి ఇటీవలి కాలంలో హింస పెరగడం పట్ల తాము ఆందోళన చెందుతున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్, భారత ప్రయోజనాల దృష్ట్యా ఇరు దేశాలు సత్సంబంధాలతో ముందుకు సాగాలని ఆయన అన్నారు. ఏ మాత్రం రెచ్చగొట్టకుండానే భారత్ సరిహద్దు వెంబడి కాల్పులకు పాల్పడుతోందని అజీజ్ ఆరోపించారు.