ట్రంప్తో భేటీ కోసం కిమ్ జాంగ్ ఉన్ వేడుకున్నాడు: 12న భేటీపై ప్రభావం చూపేనా?
వాషింగ్టన్: ప్రపంచమంతా ఈ నెల 12వ తేదీన జరగనున్న ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ తర్వాత ఎన్నో వాదోపవాదాల మధ్య ఇరు దేశాల అధినేతలు చర్చలకు సిద్ధమయ్యారు.
Recommended Video
అయితే, ఈ భేటీపై ట్రంప్ అటార్నీ జర్నల్ రూడీ గిలియాని చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ భేటీ కోసం కిమ్ జాంగ్ ఉన్న వేడుకున్నారని, అడుక్కున్నారని వ్యాఖ్యానించారు. మాతో అణుయుద్ధం జరపాలని వారు అనుకున్నారని, ఆ యుద్ధంలో మమ్మల్ని ఓడించాలనుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో భేటీ అవలేమని మేం చెప్పామని, దీంతో కిమ్ జోంగ్ ఉన్ వెనక్కి తగ్గారని, ట్రంప్తో భేటీ జరగాలని వేడుకున్నారని రూడీ చెప్పారు.
ఉత్తర కొరియా అణ్వస్త్రరహిత దేశంగా మారేందుకు చర్యలు ప్రారంభిస్తే చర్చలకు సిద్ధమని ట్రంప్ గతంలో చెప్పారు. కింగ్ జాంగ్ ఉన్న ఆ దిశలో చర్యలు తీసుకోవడంతో సింగపూర్ వేదికగా జూన్ 12న వీరి సమావేశం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ తర్వాత ఈ భేటీని రద్దు చేసుకుంటున్నట్లు ట్రంప్ అనూహ్యంగా ప్రకటన చేయడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. దీంతో వీరి సమావేశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆ తర్వాత మళ్లీ ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాల మంత్రితో భేటీ అయిన ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కిమ్తో సమావేశానికి సిద్ధమని చెప్పారు. ఇప్పుడు రూడీ వ్యాఖ్యలతో ఉత్తర కొరియా తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటుందా అనేది చూడాలి.