ఇమ్రాన్ ఖాన్ ప్రమాణంలో మోడీ ఉండరు! కచ్చితంగా వెళ్తానని కపిల్ దేవ్
న్యూఢిల్లీ/కరాచి: భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు సార్క్ దేశాధినేతలను పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించనున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ స్పందించింది. ప్రమాణ స్వీకారానికి విదేశీ నేతలను ఆహ్వానించడం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రముఖ డాన్ పత్రికలో వార్త వచ్చింది.
తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఇమ్రాన్ నిరాడంబరంగా చేసుకోవాలని భావిస్తున్నారని తెలిపింది. పాకిస్తాన్ అధ్యక్షుడి భవనంలో ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపింది. విదేశాలకు చెందిన నేతలను ఆహ్వానించడం లేదని చెప్పింది. ఇది పూర్తిగా పాకిస్తాన్ జాతీయత కార్యక్రమం అని చెప్పింది. అయితే ఇమ్రాన్ సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్, మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలకు ఆహ్వానం అందినట్లు వార్తలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ నుంచి ఆహ్వానం అందినట్లు సిద్ధూ తెలిపారు. ఈ కార్యక్రమానికి వెళ్తున్నట్లు కూడా చెప్పారు. తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అమీర్ ఖాన్ చెప్పారు.
ప్రభుత్వం అనుమతి తీసుకొని వెళ్తా: కపిల్ దేవ్
ఇమ్రాన్ ఖాన్ తన ప్రమాణ స్వీకారానికి సహచర క్రికెటర్లకు ఆహ్వానం పంపించారన్న విషయం వాస్తవమేనని కపిల్ దేవ్ తెలిపారు. కానీ ఇంతవరకు ఆ ఆహ్వాన పత్రాన్ని తాను చూడలేదన్నారు. ఒకవేళ అందులో తనకు కూడా ఆహ్వానం పంపి ఉంటే కచ్చితంగా పాకిస్థాన్కు వెళ్తానని, అయితే ఇందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకుంటానని చెప్పారు.