కాల్పుల మోత: ఉలిక్కిపడ్డ యూట్యూబ్.. తనను తాను కాల్చుకున్న మహిళ
వాషింగ్టన్: ఉత్తర కాలిఫోర్నియాలోని యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్లో కాల్పుల కలకలం రేగింది. ఓ 30ఏళ్ల మహిళ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు.
కాల్పుల అనంతరం ఆమె తనను తాను కాల్చుకుని ప్రాణాలు వదిలింది. క్షతగాత్రుల్లో ముగ్గురిని జుకర్ బర్గ్ శాన్ఫ్రాన్సిస్కో జనరల్ ఆసుపత్రికి తరలించారు. మరో 32ఏళ్ల మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు.
అలాగే కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఓ 36ఏళ్ల వ్యక్తి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.. బహుశా.. అతను ఆమె బాయ్ఫ్రెండ్ అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
బుల్లెట్ గాయమైన మరో వ్యక్తిని కంపెనీ హెడ్ క్వార్టర్స్ ముందు గుర్తించామని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు.
కాగా, లంచ్ సమయంలో సదరు మహిళ చేతిలో గన్ పట్టుకుని క్యాంపస్లోని డాబా మీదకు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొత్తం 10రౌండ్ల వరకు కాల్పులు జరిపిందని తెలిపారు.
We were sitting in a meeting and then we heard people running because it was rumbling the floor. First thought was earthquake. https://t.co/gmolQmRXm1
— Todd Sherman (@tdd) April 3, 2018
కాల్పుల ఘటనలో ఉగ్ర కోణం ఉండకపోవచ్చునని, ఇంటి వివాదాలతోనే ఆమె ఈ దుశ్చర్యకు ఒడిగట్టి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే, యూట్యూబ్ హెడ్ క్వార్టర్స్ లో మొత్తం 1700మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తాజా ఘటనతో వారంతా ఉలిక్కిపడ్డారు.
యూట్యూబ్ అధికారి స్పందన:
యూట్యూబ్ ప్రొడక్ట్ మేనేజర్ టాడ్ షేర్మన్ ఘటనపై స్పందించారు. 'ఆ సమయంలో మేమంతా ఒక మీటింగ్ లో ఉన్నాం. ఒక్కసారిగా ఉద్యోగులంతా బయటకు పరుగులు తీయడం చూసి భూకంపం వచ్చిందేమో అనుకున్నాం' అని ట్విట్టర్ ద్వారా తెలిపారు.