ప్రచారం బెడిసికొట్టింది: కిమ్కు యూట్యూబ్ షాక్, ఆ రెండు ఛానెల్స్ తొలగింపు..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు.. సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ ఊహించని షాకిచ్చింది.
వాషింగ్టన్/ప్యోంగ్యాంగ్: ఉత్తరకొరియా దుందుడు వైఖరిని ప్రపంచదేశాలన్ని ఖండిస్తున్నాయి. ఐరాస హెచ్చరికల్ని సైతం లెక్క చేయకుండా.. ప్రపంచం దేశాల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. ఉత్తరకొరియా యుద్ద మంత్రాన్నే జపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కు.. సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ ఊహించని షాకిచ్చింది. ఉత్తర కొరియా పాపులర్ యూట్యూబ్ ఛానెల్స్ను యూట్యూబ్ సంస్థ రద్దు చేసింది. స్టిమ్ కొరియాస్ తో పాటు ఉరిమింజోక్కిరి అనే రెండు ఛానెల్స్ పై వేటు పడింది.

స్టిమ్ కొరియాస్, ఉరిమింజోక్కిరి:
స్టిమ్ కొరియాస్కు 20వేల మంది, ఉరిమింజోక్కిరికి 18వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఉత్తరకొరియా అధికారిక టీవీ ఛానెల్స్ లో ప్రసారమయ్యే వీడియో క్లిప్పింగ్స్ ను ఈ ఛానెల్స్ యూట్యూబ్ లో పోస్టు చేస్తుంటాయి. ఉత్తరకొరియాకు సంబంధించిన పరిణామాలను ప్రపంచానికి తెలియజేస్తుంటాయి.
కాగా, ఉత్తరకొరియాలో కేవలం మూడు టీవి ఛానెల్స్ మాత్రమే ప్రసారమవుతాయి. అందులోను ప్రపంచ దేశాలకు సంబంధించిన వార్తల గురించి చెప్పరు. కేవలం దేశంలోని వార్తలు, అది కూడా కిమ్ ప్రభుత్వం అనుమతి పొందిన వార్తలనే ప్రసారం చేస్తారు.

ఆ ప్రచారం వల్లే:
ఇటీవల కాలంలో అణుప్రయోగాలతో ప్రపంచ దేశాలను, ముఖ్యంగా అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలను ఉత్తరకొరియా బెదరగొడుతున్న సంగతి తెలిసిందే. వీటికి సంబంధించిన వార్తలను ప్రసారం చేసిన ఆ దేశ యూట్యూబ్ ఛానెల్స్ రెండు మితిమీరి ప్రవర్తించడంతో యూట్యూబ్ వాటిని రద్దు చేసింది.
ఉత్తరకొరియా ఆయుధ సామర్థ్యం గురించి ప్రపంచ దేశాలను భయపెట్టేలా ఆ యూట్యూబ్ ఛానెల్స్ వీడియోలను ప్రసారం చేశాయి. అమెరికాను టార్గెట్ చేయగల అణు సామర్ధ్యం ఉత్తరకొరియాకు ఉందని, అమెరికా తమ దేశాన్ని టచ్ చేయకపోవడమే మేలని అందులో పేర్కొన్నాయి. ఈ వార్తలు ప్రపంచ దేశాలను అభద్రతా భావానికి గురిచేసేలా ఉండటంతో వీటిపై వేటు వేయక తప్పలేదని యూట్యూబ్ చెబుతోంది.

మిస్టరీ దేశంగా ముద్ర:
ఉత్తరకొరియన్లకు బయటి ప్రపంచంతో గానీ బయటి ప్రపంచానికి ఉత్తరకొరియాతో గానీ పెద్దగా సంబంధాలు లేవు. అసలు ఆ దేశంలో పాలనా, ఇతరత్రా వ్యవహారాల గురించి ఇప్పటివరకు కచ్చితమైన వివరాలేవి ఎవరికీ తెలియవు. అక్కడి ప్రజల జీవన స్థితిగతులు, అక్కడి పరిస్థితులు ఏ దేశానికి తెలియవు.
ఈ దేశంలో అన్ని ప్రాంతాల్లో ఫోటోలు తీయనివ్వరు. మీడియాకు స్వేచ్చ ఉండదు. విదేశీయులు వచ్చినా.. వారిపై నిఘా కొనసాగుతుంది. మొత్తం మీద తమ దేశానికి సంబంధించిన ఏ విషయాన్ని ఉత్తరకొరియా బయటకు లీక్ చేయదు. అలా ఈ దేశానికి మిస్టరీ కంట్రీ అన్నా ముద్ర పడింది.

ఉత్కంఠకు తెరపడేదెప్పుడో:
గడిచిన కొద్ది నెలలుగా అమెరికా-ఉత్తరకొరియా మధ్య వాగ్యుద్దం ముదురుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. ఉత్తరకొరియా మితిమీరిన చేష్టలు అమెరికా సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు అమెరికా ఆవేశపడితే.. పరిస్థితులు మూడో ప్రపంచ యుద్దానికి దారి తీయడం ఖాయం.
అలా అని ఉత్తరకొరియా చేష్టలను కేవలం దుందుడుకు వైఖరిగా భావిస్తే.. ఆ దేశం నుంచి పెనుముప్పు తప్పదనేది అమెరికా వాదన. ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ రెండు రోజుల క్రితం ఇవే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికా-ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతలకు ఎప్పుడు తెరపడుతుందో? అంతు చిక్కడం లేదు.












Click it and Unblock the Notifications