మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు బుమ్రా అర్హుడు కాదు: సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంజ్రేకర్కు మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉండడంతో పాటు అంతకుమించి ఇంగ్లీష్ భాషలో గలగలా మాట్లాడుతూ అద్భుతంగా కామెంటరీ చేయగలడు. అయితే ఆ కామెంటరీకి కొన్ని సందర్భాల్లో వివాదాస్పద పదాలు జోడించడంతో.. చాలాసార్లు వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలి కాలంలో తన కామెంటరీకి కన్నా.. వివాదాలతోనే మంజ్రేకర్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక బీసీసీఐ వేటుకు గురైనా కూడా తన పంథా మార్చుకోవడం లేదు.
గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-1లో 4 వికెట్లు సాధించి ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు ఇవ్వడాన్ని సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. ముంబై విజయానికి బీజం పడింది బ్యాట్స్మన్ రాణించిన కారణంగానే అనే విషయాన్ని ప్రస్తావించాడు. బ్యాట్స్మెన్కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కాల్సిందని అన్నాడు. బుమ్రా, బౌల్ట్ ప్రదర్శనను తాను తక్కువ చేయడం లేదని, కానీ మ్యాచ్ను ఏకపక్షం మార్చడంలో బ్యాట్స్మెన్ కీలక పాత్ర పోషించారని మంజ్రేకర్ చెప్పుకోచ్చాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ శుక్రవారం ఉదయం ఓ ట్వీట్ చేశాడు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చేటప్పుడు హాఫ్ స్టేజ్ తర్వాత మ్యాచ్ ఎక్కడ మలుపు తీసుకుందో చూడాలి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్తోనే ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయిందని వాస్తవం. ముంబై విజయం బ్యాట్మెన్ ఖాతాలోకే వెళుతుంది. బుమ్రా, బౌల్ట్ ప్రదర్శనను తక్కువ చేయడం లేదు. కానీ.. ఒక బ్యాట్స్మన్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తే బాగుండేది' అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్ మంజ్రేకర్పై మండిపడుతున్నారు.
When adjudicating the MOM award one must look at how the game was placed at the half way stage, MI had almost sealed the game with their batting. So the match winning impact was made by batsmen. With due respect to Boult & Bumrah, MOM should have been a batsman. #MIvDC
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) November 6, 2020
గురువారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫయర్-1లో 57 పరుగుల తేడాతో గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఆరోసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలు చేశారు. ఛేజింగ్లో ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. మార్కస్ స్టొయినిస్ (46 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. 4 వికెట్లు తీసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన జస్ప్రీత్ బుమ్రాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
మ్యాచ్ అనంతరం జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ... 'నేను వికెట్లు తీయకపోయినా, మ్యాచులు గెలిపించకపోయినా ఫర్వాలేదు. నాకో పాత్ర అప్పగించారు. దానిని 100% న్యాయం చేయడమే నాకు ముఖ్యం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే యార్కర్లు వేయడం ముఖ్యం. అందుకే వేశాను. కెప్టెన్ ఎప్పుడు బంతినిచ్చినా.. బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉంటా. తుది ఫలితంపై నేను దృష్టి పెట్టను. అలా చేసిన ప్రతిసారీ విఫలమయ్యాను. ట్రెంట్ బౌల్ట్తో సహచర్యం బాగుంది. ఎప్పుడూ బ్యాట్స్మెనే అవార్డులు తీసుకుంటారు. ఇప్పుడు బౌలర్కూ రావడం బాగుంది. అయితే మేం గెలుస్తున్నంత వరకు పురస్కారాల గురించి పట్టించుకోను' అని తెలిపాడు.