IPL 2020: సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్, రెండు జట్లకు గెలుపు పరీక్షే
దుబాయ్: గురువారం ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు కూడా బలంగా కనిపిస్తున్నప్పటికీ పాయింట్ల పట్టికలో మాత్రం అడుగునే ఉన్నాయి.
ఐపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు
కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు ఐదు మ్యాచులు ఆడి.. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. అయితే, కేఎల్ రాహుల్ 302 పరుగులు, మయాంక్ అగర్వాల్ 272 పరుగులతో ఐపీఎల్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్-3లో ఉన్నారు. ఈ జంట ఇప్పటి వరకు జరిగిన మ్యాచుల్లో 63 శాతం పరుగులు చేయడం గమనార్హం. మొహమ్మద్ షమి, రవి బిష్నోయ్లు బాగా బౌలింగ్ చేస్తున్నారు.
కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన
2014 తర్వాత పంజాబ్ జట్టు ఫైనల్ రీచ్ కాకపోవడం గమనార్హం. పంజాబ్ జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ మిగితా ఆటగాళ్ల సహకారం లభించకపోవడంతో ఈ జట్టు ఓటములను చవిచూడాల్సిన పరిస్థితి వస్తోంది. నికోలస్ పూరన్, గ్లేన్ మాక్స్వెల్, సర్ఫరాజ్ ఖాన్, జేమ్స్ నీషమ్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ సమష్టిగా రాణించలేకపోతున్నారు.
హైదరాబాద్ జట్టుకూ గెలుపు పరీక్షే.. భువీ స్థానంలో పృథ్వీరాజ్?
ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికొస్తే.. పంజాబ్ కంటే కాస్త మెరుగైన ప్రదర్శనే చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచులు ఆడిన హైదరాబాద్ జట్టు ఇందులో రెండు విజయాలను నమోదు చేసింది. బౌలింగ్ విభాగంలో కీలకంగాఉన్న భువనేశ్వర్ కుమార్ తీవ్రమైన గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. భువీ స్థానంలో పృథ్వీరాజ్ యెర్ర జట్టులో చేరుతున్నట్లు తెలిసింది. డేవిడ్ వార్నర్ తోపాటు జానీ బెయిరస్టో, కేన్ విలయమ్సన్, మనీష్ పాండేలు తమ వంతుగా రాణిస్తే హైదరాబాద్ జట్టును ఆపేవారుండరు. ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్ లాంటి ఆటగాళ్లు మిడిల్, లోయర్ ఆర్డర్లో బరిలోకి దిగుతున్నారు. మొహమ్మద్ నబి, పబియన్ అలెన్ కొంత అనుభవం కలిగిన ఆటగాళ్లుగా చెప్పుకోవచ్చు.
జట్ల కూర్పు ఇలా ఉండవచ్చు..
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు: 1. డేవిడ్ వార్నర్ (కెప్టెన్), 2. జానీ బెయిర్స్టో (డబ్ల్యుకె), 3. కేన్ విలియమ్సన్, 4. మనీష్ పాండే, 5. ప్రియమ్ గార్గ్, 6. అభిషేక్ శర్మ, 7. అబ్దుల్ సమద్, 8. రషీద్ ఖాన్, 9. సందీప్ శర్మ, 10. సిద్దార్థ్ కౌల్, 11 టి నటరాజన్.
కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టుఫ 1. కెఎల్ రాహుల్ (కెప్టెన్), 2. మయాంక్ అగర్వాల్, 3. మందిప్ సింగ్, 4. నికోలస్ పూరన్ (డబ్ల్యుకె), 5. గ్లెన్ మాక్స్వెల్, 6. సర్ఫరాజ్ ఖాన్, 7. క్రిస్ జోర్డాన్ / జేమ్స్ నీషామ్, 8. హర్ప్రీత్ బ్రార్ / ఎం అశ్విన్, 9. షెల్డన్ కాట్రెల్, 10 మహ్మద్ షమీ, 11 రవి బిష్ణోయ్. కాగా, ఈ మ్యాచ్ గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్షప్రసారం కానుంది.