ధోనీ డ్యూటీ రోహిత్ శర్మ తీసుకున్నాడుగా: అదే జరిగితే..నిషేధం వేటు: టీమ్ మొత్తంపైనా
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముగిసింది. ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళశారం రాత్రి జిరిగిన మ్యాచ్లో పైచేయి బౌలర్లదే. ఢిల్లీ కేపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్లో అతను నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఓ బౌలర్.. నాలుగు లేదా అంతకుమించి వికెట్లను తీసుకునే సంప్రదాయం ఈ సీజన్ బిగినింగ్ నుంచీ కొనసాగుతోంది. అమిత్ మిశ్రా దాన్ని మరంత ముందుకు తీసుకెళ్లాడు.
ముంబై ఇండియన్స్ కేప్టెన్ రోహిత్ శర్మకు వ్యక్తిగతంగా ఈ మ్యాచ్ నష్టాన్ని మిగిల్చింది. ప్రత్యర్థికి మ్యాచ్ను ధారదాత్తం చేసుకోవడమే కాకుండా.. జరిమానాను ఎదుర్కొనాల్సి వచ్చింది. అతనిపై 12 లక్షల రూపాయల జరిమానాను విధించారు నిర్వాహకులు. స్లోయర్ ఓవర్ రేట్ కారణంగా ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్లో ఇది రెండో జరిమానా. ఇదివరకు చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెత్తిన 12 లక్షల రూపాయల ఫైన్ పడిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్లోనే ఎంఎస్ ధోనీ ఫైన్ కట్టాడు.
ఈ సారి ఆ డ్యూటీని రోహిత్ శర్మ తీసుకున్నట్టయింది. రోహిత్ శర్మకు ఇదే తొలి జరిమానా. మరోసారి స్లోయర్ ఓవర్ రేట్ను నమోదు చేస్తే.. రోహిత్ శర్మకు పడే జరిమానా రెట్టింపు అవుతుంది. అప్పుడతను 24 లక్షల రూపాయలను కట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ మ్యాచ్ను ఆడిన 11 మంది క్రికెటర్లకు కూడా ఫైన్ మొత్తాన్ని వర్తింపజేస్తారు నిర్వాహకులు. మ్యాచ్ ఫీజులో 25 శాతాన్ని లేదా ఆరు లక్షల రూపాయలు- ఈ రెండిట్లో ఏది తక్కువ మొత్తమైతే దాన్ని ప్లేయర్లు కట్టాల్సి వస్తుంది.
ఒక సీజన్లో మూడోసారి కూడా స్లోయర్ ఓవర్ రేట్ను నమోదు చేస్తే.. ఆ జట్టు కేప్టెన్పై 30 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఒక మ్యాచ్లో నిషేధం వేటు పడుతుంది. ఇక ఆ మ్యాచ్ ఆడిన 11 మంది ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం- ఇందులో ఏది తక్కువ మొత్తమైతే దాన్ని వర్తింపజేస్తారు. ప్రస్తుతం మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ.. స్లోయర్ ఓవర్ రేట్ను ఎదుర్కొంటున్నారు. తొలి తప్పు కింద 12 లక్షల రూపాయల జరిమానాను ఎదుర్కొన్నారు.