IPL 2023 : ఈసారి ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉందా ? అంతా ఇదే చర్చ..!
ఈ ఏడాది ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతోందా అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. దీని వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. స్టార్ ఆటగాళ్లు ఇతర జట్లకు వలసపోవడం, ఉన్న ఆటగాళ్లతో తయారు చేసుకున్న జట్టు కూడా బలహీనంగా కనిపిస్తుండటం, సమతౌల్యత లోపించడం, ఈ జట్టుతో ఆడితే ఐపీఎల్ టోర్నీ గెలవడం మాట ఆటుంచి కనీసం లీగ్ దశను కూడా దాటడం కష్టమేనన్న వాదన వినిపిస్తోంది. అయినా జట్టు ఫ్రాంచైజీకి ఎలాంటి బెంగా కనిపించడం లేదు.
గత రెండు సీజన్లలో దారుణమైన ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశపరిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై అంచనాలన్నీ ఈ సీజన్ కు ముందే ఆవిరైపోయాయి. గతేడాది డిసెంబర్లో మినీ వేలంలో కీలక ఆటగాళ్లను కొనుగోలు చేయడంలోనూ విఫలమైన సన్ రైజర్స్ ఈ సీజన్ లో ఏ విధంగానూ ఇతర జట్లకు పోటీ ఇవ్వదన్న ఫీలింగ్ అందరిలోనూ తీసుకొచ్చేసింది. దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్ క్రమ్ ను కెప్టెన్ గా తీసుకున్నా స్వదేశంలో బిజీగా ఉన్న కారణంగా ఆయన స్ధానంలో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ చేసేందుకు సిద్ధమయ్యాడు.

గతంలో సన్ రైజర్స్ మెరుపులకు కారణమైన డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్ వంటి స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరిగా జట్టుకు దూరమయ్యారు. వారి స్ధానంలో తీసుకున్న వారు కూడా అంతంతమాత్రంగానే ఉండటం, వారిలో ఒక్కరు కూడా నిలకడగా ఆడి జట్టును టైటిల్ వరకూ తీసుకెళ్లే పరిస్ధితి లేకపోవడం వంటి కారణాలతో ఈసారి ఐపీఎల్ లో సన్ రైజర్స్ గురించి మాట్లాడేందుకు అభిమానులు కూడా ఇష్టపడటం లేదు.
మార్ క్రమ్, గ్లెన్ ఫిలిప్స్, హారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విదేశీ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ వీరిలో జట్టును ముందుండి వరుసగా మ్యాచ్ లు గెలిపించే సత్తా ఎవరికీ లేదు. ఇక స్వదేశీ ఆటగాళ్లను తీసుకున్నా ప్రస్తుతం టీమ్ ఇండియా తరఫున ఆడుతున్న వారు వేళ్లమీద లెక్కపెట్టేలా ఉన్నారు. బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ వంటి జాతీయ క్రికెటర్లు ఉన్నా వీరి నిలకడలేమి జట్టును వెంటాడుతునే ఉంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ జట్టు ఫోకస్ లో లేకుండా పోతోంది.












Click it and Unblock the Notifications