తిరుపతి ఉప ఎన్నిక వేళ: ఆలయాలపై దాడులు షురూ: హిందువుల మనోభావాలతో ఆటలా?: టీడీపీ
కడప: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో.. ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ-జనసేన క్యాంపెయిన్ ఉధృతిని పెంచాయి. ఈ నెల 17వ తేదీన పోలింగ్ నిర్వహించనున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి హిందూ ఆలయాలపై దాడుల వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ మండిపడుతోంది. హిందువుల మనోభావాలతో అధికార పార్టీ ఆటలాడుకుంటోందని ఆరోపిస్తోంది.
కడప జిల్లాలోని చెన్నూరులో గల కోట్ల స్వామి ఆలయం కలశాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని తెలుగుదేశం పార్టీ తెలిపింది. ఈ మేరకు ధ్వంసమైన ఆలయ శిఖరం.. కలశంతో కూడిన ఫోటోను ట్వీట్ చేసింది. అలాగే- అమ్మవారి మంగళసూత్రాన్ని కూడా దండగులు మాయం చేశారని పేర్కొంది. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసిందా పార్టీ. హిందువుల మనోభావాలను ఏ మాత్రం పట్టించుకోని అధికార పార్టీ నాయకులు, పాలకులు తిరుపతికి ఏం చేయగలరని ప్రశ్నించింది.
కోట్ల స్వామి ఆలయ కళశాన్ని ధ్వంసం చేయడం, అమ్మవారి మంగళసూత్రాన్ని చోరీ చేసిన ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ విషయాన్నికడప డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి చోరీకి గురైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. స్థానిక పోలీసులు ఆలయాన్ని సందర్శించారని, అక్కడ సీసీటీవీ కెమెరాలను అమర్చాలని ఆదేశించినట్లు తెలిపారు. సీసీటీవీ కెమెరాలను అమర్చాలంటూ తాము ఆదివరకే ఆలయ సిబ్బందికి ఆదేశించామని చెప్పారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ ఘటన వైసీపీ రాజకీయ ప్రత్యర్థులకు ప్రచారాస్త్రంగా మారే అవకాశాలు లేకపోలేదు.