కొడుకు- కోడలి పట్ల వైఎస్ విజయమ్మ మమకారం
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు. కరుణామయుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన కడప జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పులివెందుల పర్యటనలో ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి వైఎస్ విజయమ్మ, భార్య భారతి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రతి సంవత్సరం క్రిస్మస్ వేడుకలను వైఎస్ జగన్ తన స్వస్థలం పులివెందులలో, కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా ఆయన దీన్ని కొనసాగించారు. మూడు రోజుల కిందటే పులివెందులకు చేరుకున్నారాయన. తొలి రోజు కమలాపురంలో 905 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
రెండోరోజు- పులివెందులలో కొత్తగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్, అహోబిలాపురంలో ప్రాథమిక పాఠశాలను వైఎస్ జగన్ ప్రారంభించారు. అదే రోజు సాయంత్రం ఇడుపుల పాయ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ ఈవ్ సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని ఇవ్వాళ పులివెందుల భాకరాపురం సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
ఈ ఉదయం ఇడుపుల పాయ నుంచి రోడ్డు మార్గంలో నేరుగా ఆయన భాకరాపేట సీఎస్ఐ చర్చికి చేరుకున్నారు. ప్రత్యేక పార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు. సీఎస్ఐ చర్చి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.
కరుణ, ప్రేమ, క్షమాపణ, సహనం, దాతృత్వం, త్యాగం అనే అత్యున్నత సందేశాల ద్వారా ఏసుక్రీస్తు మానవాళిని సత్య మార్గం వైపు నడిపించారని జగన్ పేర్కొన్నారు. చెడు నుండి ధర్మానికి, అమానవీయత నుండి మానవత్వం వైపు, చెడు నుండి మంచికి, దురాశ నుండి దాతృత్వం, త్యాగం వరకు మానవాళికి మార్గాన్ని జీసస్ చూపించాడని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు.