ఆర్టీపీపీ వద్ద ఆందోళన తీవ్రం - జీవో 163 అమలు కోసం..!!
కడప: కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద నిరసనల పర్వం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా నిర్వాసితులు, కాంట్రాక్టు కార్మికులు అక్కడ ఆందోళన చేస్తోన్నారు. దీన్ని పరిష్కరించడానికి జెన్కో అధికారులు గానీ, జిల్లా పాలన యంత్రాంగం గానీ పెద్దగా దృష్టి సారించట్లేదు. ఫలితంగా నిర్వాసితులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వం నుంచి దిగివచ్చేంత వరకూ నిరసనలను కొనసాగిస్తామని స్పష్టం చేస్తోన్నారు.
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావట్లేదనేది ఆర్టీపీపీ నిర్వాసితులు, కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన ఆందోళన. ఆర్టీపీపీలో 1,600 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన పని చేస్తోన్నారు. తమ ఉద్యోగాలను క్రమబద్దీకరిస్తామంటూ గత ప్రభుత్వాలు పలుమార్లు హామీలు ఇచ్చాయని, అవి అమలు కావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. దశాబ్దాల కాలం పాటు తాము చాలీచాలని జీతాలతో ఆర్టీపీపీలో పనిచేస్తున్నామని, ఎప్పటికైనా తమ ఉద్యోగాలు క్రమబద్దీకరణకు నోచుకుంటాయనే ఆశతో ఉన్నామని అన్నారు.
అదే సమయంలో నెల్లూరు థర్మల్ కేంద్రంలో పని చేస్తోన్న కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను జెన్కో అధికారులు రెగ్యులరైజ్ చేశారని, వారిని ఆర్టీపీపీకి బదిలీ చేశారని చెప్పారు. వారితో తమ ఉద్యోగాలను కూడా క్రమబద్దీకరించాల్సి ఉన్నప్పటికీ- అధికారులు అలా చేయట్లేదని ఆరోపించారు. తమకు తీవ్రంగా అన్యాయం చేస్తోన్నారని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 163ని తమకు అనుకూలంగా మలచుకుని తమకు నచ్చిన వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తోన్నారని పేర్కొన్నారు.
ఇదే 163 నంబర్ జీవో ఆర్టీపీపీలో పని చేస్తోన్న 1,600 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తోన్నారు. భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీపీపీలో పని చేస్తోన్న ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తమకు అండగా ఉన్నారని, ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. రిలే నిరాహార దీక్షకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోందని కాంట్రాక్ట్ కార్మికులు, భూ నిర్వాసితుల జేఏసీ ప్రతినిధులు వెల్లడించారు.