Badvel Byelection: తెరమీదికి తిరుమల: వ్యాపారక్షేత్రంగా మార్చేశారంటోన్న చంద్రబాబు
కడప: రాష్ట్రంలో మరోసారి హిందుత్వ అంశం తెరమీదికి వచ్చినట్టే కనిపిస్తోంది. తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల సమయంలో విస్తృతంగా వార్తల్లోకి ఎక్కిన హిందూయిజం మళ్లీ పుట్టుకొస్తోన్నట్టే. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక దీనికి ఓ కారణం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఉప ఎన్నికను నిర్వహించాల్సి వస్తోంది. అప్పట్లో తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ, ఏపీలో తిరుపతి లోక్సభ స్థానానికి ఒకేసారి ఉప ఎన్నికలు జరిపినట్టే- ఈ సారి అక్కడ హుజూరాబాద్, ఏపీలో బద్వేల్ బైపోల్స్కు నోటిఫికేషన్ ఒకేసారి వెలువడే ఛాన్స్ లేకపోలేదు.
తాజాగా- తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలను కేంద్రబిందువుగా పోస్ట్ చేసిన ఓ ట్వీట్.. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బద్వేలు ఉప ఎన్నిక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్టయింది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలోని టికెట్ల విక్రయ కౌంటర్లు, కొన్ని రకాల సేవలను టీటీడీ అధికారులు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించినట్టు వచ్చిన వార్తపై స్పందించి చంద్రబాబు చేసిన ట్వీట్ పోస్టులు అవి.

ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలను వివాదాలు, వివాదాస్పద నిర్ణయాలకు కేంద్రంగా మార్చేస్తున్నారంటూ చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరిస్తోన్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జాతీయ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు ఆధ్యాత్మిక, సేవా దృక్పథంతో భక్తులకు ఉచితంగా పలు సేవలను అందించేవని గుర్తు చేశారు. బ్యాంకులు ఉచితంగా టీటీడీకి సేవలను అందించడం వల్ల ఒక్క పైసా కూడా అదనంగా భారం పడేది కాదని అన్నారు. పైగా ఈ సేవా కార్యక్రమాల్లో ఎంతో మంది భక్తులు స్వచ్ఛందంగా పాల్గొని ఉచితంగా శ్రీవారి దర్శనాన్ని పొందే వీలుండేదని అన్నారు.
దీనికి భిన్నంగా టీటీడీ వివాదాస్పద నిర్ణయాలను తీసుకుందని చంద్రబాబు అన్నారు. స్వచ్చంద, ఉచిత సేవలు చేస్తున్న వారిని తప్పించి లడ్డూ వితరణ, కల్యాణకట్ట, దర్శన టికెట్ల స్కానింగ్ వంటి సేవలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం సహేతుకం కాదని అన్నారు. ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. పవిత్ర పుణ్య క్షేత్రంలో టీటీడీ అధికారులు వ్యాపార బీజాలను నాటుతున్నారని విమర్శించారు. కమీషన్ల కక్కుర్తి కోసం స్వామివారి సేవలకు ఎదురు చెల్లింపులు ఇస్తోన్నారని మండిపడ్డారు. సజావుగా బ్యాంకులు, శ్రీవారి సేవకుల ద్వారా సాగిపోతున్న ఉచిత సేవలను కాదని, దీన్ని ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications