వైయస్ మరణించాక ఈ 9 ఏళ్ల జీవితం ఒక ఎత్తు..! జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చలించిపోయిన విజయమ్మ..
కడప / హైదరాబాద్ : చాలా రోజుల తర్వాత దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి భార్య, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మీడియా మందుకు వచ్చారు. క్రిష్టమస్ పర్వదినం సందర్బంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఆమె తన కుటుంభ సభ్యులతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. దేవుడు తనకు మంచి భర్తను, కుటుంబాన్ని ఇచ్చాడని విజయమ్మ అన్నారు. మంగళవారం పులివెందుల సీఎస్ఐ చర్చిలో వైఎస్. విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు, సాక్ష్యం చెప్పారు. ప్రభువు వైఎస్. రాజశేఖర్ రెడ్డికి మంచి పరిపాలనను ఇచ్చే శక్తిని ఇచ్చారని, దేవుని ఆశీర్వాదం వల్లే ఆయన కోట్ల మంది గుండెల్లో నిలిచి పోయారని పేర్కొన్నారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక ఈ 9 ఎళ్ల నా జీవితం ఒక ఎత్తు అన్నారు విజయమ్మ. ఇటీవల జగన్ పై జరిగిన హత్యాయత్నంలో దేవుడి కృపే ఆయన్ను కాపాడిందని, ప్రభువు జగన్ పక్షాన ఉన్నాడన్నారు విజయమ్మ. వైఎస్సార్ లాగే జగన్ తో కూడా ప్రజలకు మరింత సేవ చేయించుకోవాలని దేవుడు భావించి ఉంటాడని ఆమె తెలిపారు.
పాదయాత్రలో నిత్యం దేవుడు జగన్ కు తోడుగా ఉండి కాపాడుతున్నాడని, రానున్న రోజుల్లో ఆయన లక్ష్యం నెరవేరుస్తాడని, జగన్ కోసం ప్రార్థిస్తున్న కొట్లాది మందికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వైఎస్ కుటుంబం తరపున అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు విజయమ్మ.