పులివెందులలో జగన్: వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్ట్కు..!!
కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో వరుసగా జిల్లాల పర్యటనలు చేస్తోన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ నెల 21వ తేదీన బాపట్ల జిల్లాలో పర్యటించారు. యడ్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్స్ పంపిణీ చేశారు. ఒక్కరోజు విరామం తరువాత ఆయన ఇవ్వాళ తన సొంత జిల్లాలో పర్యటిస్తోన్నారు. కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది.

ఎయిర్ పోర్టులో..
గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్.. ఈ మధ్యాహ్నం కడపకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ లో ఆయనకు ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాషా, లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో నేరుగా కడప పెద్ద దర్గాను సందర్శించారు. అమీన్ పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఛాదర్ను సమర్పించారు.

అమీన్ పీర్ దర్గాలో..
ఆ సమయంలో జగన్ వెంట అంజాద్ బాషా, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన జిల్లా నాయకులు ఉన్నారు. ప్రార్థనల అనంతరం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చేరుకున్నారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ నాడు పులివెందుల చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది వైఎస్ జగన్ కు. ఈ సంవత్సరం కూడా ఆయన దీన్ని కొనసాగించారు.

ఆనవాయితీ కొనసాగింపు..
ఎల్లుండి స్థానిక చర్చిలో ప్రార్థనల్లో పాల్గొననున్నారు. అదే రోజు పులివెందుల బస్టాండ్ను ప్రారంభిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద బస్టాండ్గా అధికారులు దీన్ని నిర్మించారు. రాయలసీమకు సాగునీటి అవసరాలను తీర్చడానికి నిర్మించిన గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా సుజల స్రవంతి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. కమలాపురంలో మరో 902 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్..
రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతిపాదించిన గాలేరు-నగరి సుజల స్రవంతి పథకం కింద ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి జగన్ ప్రభుత్వం ఇదివరకే శ్రీకారం చుట్టింది. ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కు కమలాపురంలో శంకుస్థాపన చేయనున్నారాయన. వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి పనులను పూర్తి చేసి, ఆయకట్టుకు నీరు అందించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు.












Click it and Unblock the Notifications