పులివెందులకు జగన్: కార్యకర్తలతో ముఖాముఖి
YS Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. జిల్లాలోని సొంత నియోజకవర్గం పులివెందులలో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. పార్టీ నాయకులను కలుస్తారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత సొంత నియోజకవర్గానికి వెళ్లనుండటం ఇది రెండోసారి.
ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటన తలపెట్టారు. శనివారం ఉదయం జగన్.. తాడేపల్లి నుంచి కడపకు బయలుదేరి వెళ్తారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు వెళ్తారు. ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు. 8వ తేదీన ఉదయం వైఎస్సార్ సమాధి వద్ద నివాళి అర్పిస్తారు.

అనంతరం ఉమ్మడి కడప జిల్లా నేతలతో సమావేశమౌతారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ (బద్వేలు), అకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట) సహా కడప, అన్నమయ్య రాయచోటి, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జగన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో జగన్ ముఖాముఖి భేటీ కానున్నారు. మళ్లీ 9వ తేదీన తాడేపల్లికి చేరుకుంటారు.
వైఎస్సార్ జయంతి కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలంటూ ఇదివరకే ఆయన పార్టీ క్యాడర్కు సూచించారు. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేలా పార్టీపరంగా అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రక్తదాన శిబిరాలు, పాఠశాలల్లో పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, చెట్లు నాటడం వంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు. ఓటమితో డీలా పడ్డ క్యాడర్లో వైఎస్సార్ జయంతి రోజున ఉత్తేజం నింపేలా గ్రామగ్రామాన జెండాలను ఎగురవేయాలని, ఆయన చిత్రపటానికి నివాళి అర్పించాలని కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు.












Click it and Unblock the Notifications