పులివెందులలో దిగిన సీబీఐ అధికారులు: ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి గురించి ఆరా..!!
కడప: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ.. సీబీఐ అధికారులు ఇవ్వాళ కడప జిల్లా పులివెందులకు చేరుకున్నారు. సుమారు గంటపాటు అక్కడే గడిపారు. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వారి గురించి ఆరా తీశారు. కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.
హైప్రొఫైల్..
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న హైప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసు ఇది. 2019 మార్చి 15వ తేదీన తన నివాసంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.
సిట్ ఏర్పాటుతో..
కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి దేవగుడి ఆదినారాయణ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. దాన్ని ఆయన తోసిపుచ్చారు. ఈ హత్యోదంతాన్ని విచారించడానికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
సీబీఐ చేతికి
ఆ తరువాత కూడా వైఎస్ వివేకా హత్యకేసు ఆశించినంత వేగంగా ముందుకు సాగకపోవడంతో- ఆయన కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సీబీఐకి బదలాయించాలంటూ విజ్ఞప్తి చేస్తూ పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు- ఈ కేసును సీబీఐకి అప్పగించింది.
భాస్కర్ రెడ్డి పేరు..
అప్పట్లో కొందరు అనుమానితుల పేర్లను సునీత తన పిటీషన్లో పొందుపరిచారు. ఇంటి వాచ్మన్ రంగయ్య, సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, కడప లోక్ సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిల పేర్లను చేర్చారు.
పులివెందులకు..
ఈ నేపథ్యంలో- తాజాగా సీబీఐ అధికారులు పులివెందులకు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పులివెందుల నియోజకవర్గం వైసీపీ కార్యాలయానికీ వెళ్లారు. భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీశారు. ఆయన కార్యాలయానికి రాలేదని సిబ్బంది బదులిచ్చారు.
గతంలో ఓసారి..
పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి కూడా సీబీఐ అధికారులు వెళ్లినట్లు చెబుతున్నారు. ఆయన ఆచూకీ తెలియకపోవడంతో వెనుదిరిగారు. గతంలో ఆయన సీబీఐ అధికారుల విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మరోసారి భాస్కర్ రెడ్డి గురించి ఆరా తీయడం, ఆయన కోసం నేరుగా పులివెందులకే చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.