వివేకా హత్యకేసులో కీలక పరిణామం: ఆ అధికారిపై బదిలీ వేటు: టీడీపీ లేఖ ఎఫెక్ట్
కడప: రాష్ట్రంలో రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ పీ వరుణ్ రెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయనను ఒంగోలు సెంట్రల్ జైలుకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఒంగోలు జైలు సూపరింటెండెంట్గా పని చేస్తోన్న ప్రకాష్ను నియమించింది. పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన కొద్దిసేపటికే వరుణ్ రెడ్డికి ప్రభుత్వం స్థాన చలనం కల్పించింది.

సీబీఐ ఆదేశాలు..?
వైఎస్ వివేకా హత్యకేసును విచారిస్తోన్న కేంద్రీయ దర్యాప్తు సంస్థ.. సీబీఐ చేసిన సూచనల మేరకే ప్రభుత్వం- వరుణ్ రెడ్డిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఈ హైప్రొఫైల్ హత్యకేసులో అరెస్టయిన నిందితులు ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో విచారణను ఎదుర్కొంటోన్నారు. వారికి ప్రాణహాని ఉందంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్బ్యురో సభ్యుడు వర్ల రామయ్య- సీబీఐకి లేఖ సైతం రాశారు. నిందితులకు ప్రాణహాని ఉందనడానికి కారణాలను కూడా వివరించారు.

వర్ల రామయ్య లేఖ..
ఇదివరకు పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శ్రీను అనంతపురం జైలులో హత్యకు గురయ్యారనే విషయాన్ని వర్ల రామయ్య తన లేఖలో ప్రస్తావించారు. అప్పుడు ఇదే వరుణ్ రెడ్డి అనంతపురం జైలర్గా ఉన్నారని గుర్తు చేశారు. ఆయనే ఇప్పుడు కడప జైలర్గా ఉన్నారని పేర్కొన్నారు. అదే జైలులో వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు ఉన్నారని, అనంతపురంలో చోటు చేసుకున్న హత్యోదంతం మళ్లీ పునరావృతం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

చంద్రబాబు కూడా ఆందోళన..
వరుణ్ రెడ్డి పనితీరు పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సైతం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వరుణ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ రెండు రోజుల కిందటే ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తాము సీబీఐ అధికారులకు లేఖ సైతం రాస్తామని స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా వర్ల రామయ్య లేఖ రాశారు. అనంతపురం జైలులో మొద్దు శ్రీను హత్య చోటు చేసుకున్న సమయంలో వరుణ్ రెడ్డి జైలర్గా ఉన్నారనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
Recommended Video

బదిలీల కలకలం..
ఈ ఘటనలో వరుణ్ రెడ్డి సస్పెండ్ కూడా అయ్యారని వర్ల రామయ్య పేర్కొన్నారు. ఆయన సీబీఐకి ఈ లేఖ రాసిన తరువాతే- ప్రభుత్వం వరుణ్ రెడ్డిని బదిలీ చేసింది. పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్ను బదిలీ చేయడం, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, ఇంటెలిజెన్స్ చీఫ్ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిని ఆ హోదాలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ కొద్దిసేపటికే- వరుణ్ రెడ్డిని కూడా బదిలీ చేసింది ప్రభుత్వం.












Click it and Unblock the Notifications