YSR: పేదల ఇంట్లో దేవుడిగా - పూజా మందిరంలో ఫొటోలు: ఏకైక నేతగా..!!
అమరావతి: ఇవ్వాళ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. 2009లో ఆయన ఇదే రోజు కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో నిర్వహించ తలపెట్టిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కర్నూలు జిల్లా నల్లమల అడవుల్లో కుప్పకూలింది. ఆయన ఇక లేరనే వార్త తెలిసిన వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా స్తంభించిపోయింది. శోకసంద్రంగా మారింది.

పేద కుటుంబాలతో అనుబంధం..
వైఎస్సార్ మరణవార్త విని కంటతడి పెట్టని కుటుంబం ఉండకపోవచ్చు. పలు గుండెలు ఆగిపోయాయంటే- వైఎస్సార్ అనే అక్షరాలతో వారికి ఉన్న అనుబంధం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తమ కుటుంబ పెద్ద కన్నుమూసినట్లు భావించాయి పేద కుటుంబాలు. ఇంట్లో తాము నిత్యం పూజించే దేవుడి పటాల వద్ద వైఎస్సార్ ఫొటోను ఉంచిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఇతర పార్టీలకు చెందిన నాయకుల నివాసాల్లో వైఎస్సార్ నిలువెత్తు ఫొటోలు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి.

చిరస్మరణీయుడిగా..
జనం గుండెల్లో వైఎస్సార్ స్థానం ఏమిటనేదనడానికి ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రూపాయి డాక్టర్గా తన కేరీర్ను ప్రారంభించిన ఆయన రాజకీయాల్లో తనకంటూ చెరగని ముద్ర వేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన జలయజ్ఞం ఆయనను చిరస్మరణీయుడిని చేశాయి. కాంగ్రెస్ చరిత్రలో లేనివిధంగా ఆ పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్సార్దే.

విద్య, వైద్యంపై చెరగని ముద్ర..
విద్య, వైద్యంపై వైఎస్సార్ది చెరగని ముద్ర. అత్యంత ఖరీదైన ఆ రెండింటినీ పేదల ముంగిటికి చేర్చగలిగారు. ప్రతి పేద విద్యార్థీ అత్యున్నత చదువులు చదివేలా చేశారు. ప్రతి పేద కుటుంబానికీ కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా అత్యున్నత చదువులను అభ్యసించారు. నిరు పేదలు కలలో కూడా ఊహించని విధంగా ఆరోగ్యశ్రీ పథకంతో కార్పొరేట్ వైద్యాన్ని పొందారు. ఈ రెండు పథకాలు వైఎస్సార్ పేదల పెన్నిధిగా మార్చేశాయి.

ఉచిత విద్యుత్తో వ్యవసాయం పండగలా..
ఇందిరమ్మ ఇళ్లతో లక్షలాది పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేశారు వైఎస్సార్. రెండు రూపాయలకే కిలోబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతాంగానికి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ను అందజేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనంటూ రాజకీయ ప్రత్యర్థులు కూడా దీన్ని కొనసాగించేలా చేశారు. పేదల గుండెకు సామాజిక భద్రతను కల్పించారు. పరిపాలనను కొత్తపుంతలు తొక్కించారు.

పోలవరం అనుమతులు..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 80 శాతానికి పైగా పనులను పూర్తి చేసుకున్న పోలవరం ప్రాజెక్టుకు అనుమతులను తీసుకుని రావడంలో వైఎస్సార్ పోషించిన పాత్ర ఎవరూ విస్మరించలేనిది. అనుమతులు లభిస్తాయనే ఉద్దేశంతోనే ఆయన ముందుగానే పోలవరం కాల్వలను తవ్వించారు. వైఎస్సార్కు తన నిర్ణయాల మీద తనకు ఉన్న నమ్మకానికి ఇది అద్దం పడుతోంది.

వైఎస్ జగన్ ఎమోషనల్
తన తండ్రి వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్ ఆయనకు నివాళి అర్పించారు. నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించారని, ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని చాటి చెప్పారని గుర్తు చేశారు. తాను వేసే ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తి పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితోనే తన ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పారు.

ఇడుపుల పాయలో..
కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ జగన్ ఇవ్వాళ కుటుంబ సభ్యులతో కలిసి తండ్రికి నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిలతో కలిసి వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. తండ్రి సమాధిపై పూలమాల ఉంచి మౌనం పాటించారు. అనంతరం వైఎస్ విగ్రహానికి పూల మాల వేశారు.












Click it and Unblock the Notifications