Karimnagar హైఅలర్ట్: 8 మందికి కరోనా పాజిటివ్, 100 వైద్య బృందాలు, హెచ్చరికలు
కరీంనగర్: దేశ వ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్.. తెలంగాణలోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే 7 కేసులు నమోదు కాగా.. తాజాగా ఒక్క కరీంనగర్లోనే కొత్తగా మరో 8 కేసులు నమోదు కావడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరుకుంది. విదేశాల నుంచి వచ్చిన వారిలోని 8 మందికే కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది.

కరీంనగర్లో 8 మందికి కరోనా పాజిటివ్..
ఇటీవల ఇండోనేషియాకు చెందిన కొందరు కరీంనగర్కు వచ్చారు. నగరంలోని మసీదుల్లో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. కాగా, మార్చి 16న కరోనాపరీక్షల నిమిత్తం 12 మందిని హైదరాబాద్ తరలించగా.. మార్చి 18న మరో 9 మందిని తీసుకెళ్లారు. అయితే వీరిలో 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఆ వ్యక్తులు ఏయే ప్రాంతాల్లో సంచరించారో...
ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా అధికారులు ఇండోనేషియా బృందంతో సన్నిహితంగా ఉన్నవారి కోసం గాలింపు మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో కరీంనగర్ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కరీంనగర్లో ఉన్న మూడు రోజుల్లో ఇండియోనేషియా బృంద సభ్యులు ఎవరెవరిని కలిశారు? ఏయే ప్రాంతాల్లో సంచరించారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇండోనేషియా బృందం కలెక్టరేట్కు సమీపంలోని ప్రార్థనా మందిరాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. మార్చి 14, 15 తేదీల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరు సంచరించారని అధికారులు గుర్తించారు. ఇంకా ఏయే ప్రాంతాల్లో సంచరించారనే విషయంపై సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు.

100 ప్రత్యేక బృందాలు..
ముందస్తు చర్యల్లో భాగంగా ఇండోనేషియా బృందం కరీంనగర్లో సంచరించిన ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకునేలా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించినట్లు సమాచారం. గురువారం నుంచి కరీంనగర్లో 100 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Recommended Video

ప్రజలకు జాగ్రత్తలు..
ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ప్రాంతాల్లోని ప్రజలను వారి ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. కరోనా కలకలంపై మంత్రి గంగుల కమలాకర్.. జిల్లా కలెక్టర్, వైద్య అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ప్రజలు సమస్య తీవ్రతను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇండోనేషియా బృంద సభ్యులు సంచరించిన ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. నగరంలో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన షాపులు, ఇతర సంస్థలు, సినిమా హాళ్లు మూసివేస్తే మంచిదని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే తప్ప ప్రజలు బయటకి రాకూడదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications