ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్పై దాడి, రెండు కార్లు ధ్వంసం: టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ
కరీంనగర్: జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో భారతీయ జనతా పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్కు చేదు అనుభవం ఎదురైంది. గోదావరి ముంపును పరిశీలించడానికి వెళ్లిన ఎంపీని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి సంబంధించిన భూ వివాదం పరిష్కరించకుండా ఎందుకు వచ్చారంటూ ఆయనను నిలదీశారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
పోలీసులు గ్రామస్థులను పక్కకు తప్పించగా.. ఎంపీ అరవింద్ గోదావరి ముంపు ప్రాంతాల పరిశీలనకు వెళ్లారు. మరోసారి గ్రామస్తులు అడ్డుకోవడంతో తిరుగుపయమయ్యారు అరవింద్. అయినా వారు అడ్డుకున్నారు. కాన్వాయ్ కు అడ్డువచ్చిన గ్రామస్తులను పోలీసులు తప్పించి అరవింద్ కాన్వాయ్ ను ముందుకు పంపించారు.

దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు ఎంపీ కాన్వాయ్ పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ క్రమంలో రెండు వాహనాల అద్ధాలు ధ్వంసమయ్యాయి. కాగా, గ్రామస్తుల ముసుగులో టీఆర్ఎస్ గూండాలే
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్పై దాడి చేశారని ఆరోపించారు బీజేపీ నేతలు.
తాను తన పార్లమెంటు నియోజకవర్గంలో పలు గ్రామాలకు వెళ్లినప్పుడు దాడులు చేయాలని మాజీ ఎంపీ కవిత, అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రులు టీఆర్ఎస్ కార్యకర్తలకు సూచనలు చేశారని, అందుకే ఇప్పటి వరకు తనపై, బీజేపీ కార్యకర్తలపై పలుమార్లు దాడులు జరిగాయని చెప్పారు ధర్మపురి అరవింద్. తాను వర్షాలు, వరద బాధితులను పరామర్శించేందుకు వెళుతుంటే అడ్డుకుని, దాడి చేశారని మండిపడ్డారు. ప్రజలు బీజేపీకి దగ్గరవుతున్నారనే అక్కసుతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారని టీఆర్ఎస్పై ధ్వజమెత్తారు.

కాగా, గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరద బాధితులను పరామర్శించేందుకు ఎంపీ అరవింద్ వెళ్లారు.












Click it and Unblock the Notifications