టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్... సొంత గూటి నేతల నుంచే ఊహించని ఝలక్...
చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కు సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికలో తాను ప్రతిపాదించిన నలుగురు సభ్యుల్లో ముగ్గురు ఓటమిపాలయ్యారు.
పార్టీకి చెందిన కౌన్సిలర్లు తాను మద్దతునిచ్చినవారిని కాదని,సొంతంగా అభ్యర్థులను నిలిపి పంతం నెగ్గించుకున్నారు. ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా సొంత అభ్యర్థులను బరిలో నిలపడంతో కాంగ్రెస్,బీజేపీ కూడా వారికి మద్దతునిచ్చాయి. దీంతో రవిశంకర్ నిలిపిన నలుగురిలో ముగ్గురు అభ్యర్థులు ఓటమిపాలయ్యారు.
కౌన్సిల్లో మొత్తం 14 మంది కౌన్సిలర్లు ఉండగా ఒకరు ఓటు వేయలేదని సమాచారం. ఎక్స్అఫియో సభ్యుడి హోదాలో ఎమ్మెల్యే రవిశంకర్ ఓటేశారు. సాధారణంగా మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికను అధికార పార్టీలు ఏకగ్రీవం చేసుకోవడం లేదా గెలుచుకోవడం సహజం. కానీ చొప్పదండిలో ఎమ్మెల్యే రవిశంకర్కు,కౌన్సిలర్లకు మధ్య ఉన్న విభేదాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్లతో సమన్వయం లేకపోవడం,వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్లే ఇలా జరిగిందన్న వాదన వినిపిస్తోంది.

రాష్ట్రంలోని చాలావరకు మున్సిపాలిటీల్లో మున్సిపల్ కో-ఆప్షన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ప్రభుత్వం గత నెల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కౌన్సిలర్ హోదాకు సమానమైన పోస్టు కావడంతో ఎప్పటిలాగే చాలా మున్సిపాలిటీల్లో ఆశావహులు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి పదవులు దక్కించుకునే ప్రయత్నాలు చేశారు. నిజానికి ఈ పోస్టులు అధికారులు, సభ్యులకు మధ్య భాషాపరమైన సమస్యలను తీర్చేందుకే. ఇరువురికి ఒకరి భాష ఒకరికి అర్థం కాకపోతే ఎక్స్అఫియో సభ్యులు కలగజేసుకుని పరిష్కారాలు చూపుతారు. అయితే ప్రస్తుతం కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కూడా పూర్తిగా రాజకీయమయం అయిపోయింది. అధికార పార్టీలే కోఆప్షన్ సభ్యుల పదవులు దక్కించుకోవడం కామన్గా మారింది.












Click it and Unblock the Notifications