బ్యూటిషియన్ మృతితో లింక్: ఎస్సై మంచివాడు.. మీడియా వాహనం దగ్ధం చేసిన గ్రామస్తులు, ఉద్రిక్తం
ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు, హైదరాబాదులో బ్యూటిషియన్ శిరీష ఆత్మహత్యకు సంబంధం ఉందని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై కుకునూరుపల్లి గ్రామస్థులు భగ్గుమన్నారు.
హైదరాబాద్: ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు, హైదరాబాదులో బ్యూటిషియన్ శిరీష ఆత్మహత్యకు సంబంధం ఉందని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై కుకునూరుపల్లి గ్రామస్థులు భగ్గుమన్నారు.
శిరీషతో ప్రభాకర్ రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని తప్పుడు కేసు బనాయిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు గ్రామంలోకి వచ్చిన మీడియా వాహనాలపై విరుచుకుపడ్డారు. ఎన్టీవీకి చెందిన డిఎస్ఎన్జీ వాహనాన్ని తగులబెట్టారు. మరో ఛానల్ జిఎస్ఎన్జీని అదుపులోకి తీసుకొని తమ వాదన వినిపించారు కొందరు.

ఎస్సైపై అసత్య ఆరోపణలు
ఫిల్మ్ నగర్లో మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందిన బ్యూటీషియన్ శిరీష ఘటనకు, ఈ రోజు ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ ఘటనకు లింకు పెడుతూ పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో శిరీషతో ప్రభాకర్ అసభ్యగా ప్రవర్తించినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు.

ప్రభాకర్ రెడ్డి మంచి వ్యక్తి, 26 గ్రామాల ప్రజలకు తెలుసు
బుధవారం మీడియాలోనూ ఇటువంటి కథనాలే రావడంతో ఆ వార్తలను ఖండిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రభాకర్ రెడ్డి ఎంతో మంచి వ్యక్తి అని, కుకునూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని 26 గ్రామాల ప్రజలకు ఆయన ఎటువంటి వాడో తెలుసునని అంటున్నారు. పోలీసులు ఇచ్చిన తప్పుడు సమాచారంతో మీడియాలో తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు.

హత్య చేశారని ఆరోపణలు
పోలీసు అధికారుల ఒత్తిడితోనే ప్రభాకర్ రెడ్డి చనిపోయాడని, ఆయనను హత్యే చేసి ఉండవచ్చునని ఆరోపిస్తున్నారు. ధైర్యవంతుడైన ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

రెండు ఘటనలపై ప్రకటన లేదని..
శిరీష అనుమానాస్పద మృతి, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యల నేపథ్యంలో ఈ రెండు ఘటనలపై పోలీసుల నుంచి స్పష్టమైన ప్రకటనలు ఎలాంటివి రాలేదని మీడియాలో ప్రచారం సాగుతోంది. పోస్టుమార్టం నివేదికను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.

ఎస్సై సూసైడ్ నోట్ ఉన్నట్లు ప్రచారం..
ఎస్సై ప్రభాకర్ రెడ్డి సూసైడ్ నోట్ అధికారుల వద్ద ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు, ప్రభాకర్ రెడ్డి తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై డిజిపి అనురాగ్ శర్మ ఆరా తీశారు. ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు అత్యవసరంగా భేటీ అయ్యారు.

శిరీశ మృతిపై భిన్న కోణాలు
శిరీష మృతికి, ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు ముడిపెట్టడాన్ని కుకునూరుపల్లి గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఆత్మహత్యలపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు సవాలక్ష అనుమానాలు కలుగుతున్నాయి.












Click it and Unblock the Notifications