ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు ఛేధించిన పోలీసులు: కన్న తండ్రే హంతకుడు!
కరీంనగర్: నగరంలో ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. 21 రోజులపాటు లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు రాధిక హంతకుడ్ని గుర్తించారు. ఆమె కన్న తండ్రే ఈ దారుణానికి ఒడిగట్టారని తేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

హత్య చేసి.. అమాయకంగా..
ఫిబ్రవరి 10న కరీంనగర్లోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ముత్త రాధిక ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. అయితే, అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె వైద్య ఖర్చులు భరించలేక ఆమె తండ్రే దిండుతో నొక్కి చంపి, ఆ తర్వాత గొంతుకోసినట్లు తెలిపారు. తనపై ఎలాంటి అనుమానం రాకుండా కుమార్తెను కొందరు దుండగులు హత్య చేశారని, ఇంట్లోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారని కొమురయ్య అందర్నీ నమ్మించాడు. రాధిక తండ్రి ఫిర్యాదు మేరకు కరీంనగర్ టూటౌన్ సీఐ దేవారెడ్డి కేసు నమోదు చేశారు.

సుదీర్ఘ విచారణ
సెలవులో ఉన్న సీపీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు సంఘటనా స్థలాన్ని ఇద్దరు అదనపు డీసీపీలు ఎస్ శ్రీనివాస్, జీ చంద్రమోహన్ పరిశీలించారు. జాగిలాలు, ఫోరెన్సిక్ నిపుణులతో ఆధారాలు సేకరించారు. దర్యాప్తు కోసం 8 బృందాలు ఏర్పాటు చేశారు. సీపీ పర్యవేక్షణలో రాధిక కేసును ఇద్దరు అదనపు డీసీపీలు, ఒక ఏసీపీ, 10 మంది సీఐలు, 61 మంది ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బందితో సుదీర్ఘ విచారణ జరిపారు.

జర్మనీ టెక్నాలజీ... పక్కా ఆధారాలతో
జర్మనీ టెక్నాలజీతో సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. సుమారు 3000 ఫోన్ కాల్స్ను క్షుణ్ణంగా పరిశీలించారు. కుటుంబసభ్యులు, బంధువుల ఫోన్ డేటాను సేకరించారు. సేకరించిన పూర్తి ఆధారాలతో రాధికను హత్య చేసింది బయటి వ్యక్తులు కాదని నిర్ధారించుకున్నారు. కుటుంబ సభ్యులపై అనుమానం కలగడంతో రాధిక తండ్రిని అదుపులోకి తీసుకుని విచారించారు. సీన్ రీకన్స్ట్రక్చన్ చేశారు. వేలిముద్రలు, పోస్టుమార్టం రిపోర్టు, డీఎన్ఏ నివేదిక, సాంకేతిక ఆధారాలతో లోతుగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. పక్కా ఆధారాలతో రాధిక తండ్రిని అరెస్ట్ చేశారు. నిందితుడు హత్యకు సంబంధించిన వివరాలను రాబట్టినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications