సికింద్రాబాద్ విధ్వంసం సీఎంవో కుట్రే: బండి సంజయ్, మరీ యూపీలో యోగి చేశారా.. హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రంలో అగ్నిపథ్ ఘర్షణలపై డైలాగ్ వార్ జరుగుతుంది. బీజేపీ- టీఆర్ఎస్ మధ్య మాటల యుద్దం తీవ్ర స్థాయికి చేరింది. సికింద్రాబాద్లో నిరసనలకు కారణం మీరంటే మీరు అని ఒకరికొకరు అంటున్నారు. సీఎంవో కార్యాలయం కుట్ర వల్లే సికింద్రాబాద్ విధ్వంసం జరిగిందని బండి సంజయ్ ఆరోపించారు. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా శక్తి కేంద్ర ఇంఛార్జిల సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు.

సీఎంవో కుట్ర
సికింద్రాబాద్ విధ్వంసం ముమ్మాటికీ సీఎంఓ కుట్రేనని బండి సంజయ్ అన్నారు. సికింద్రాబాద్లో విధ్వంసం జరగబోతుందనే సమాచారం రాష్ట్ర ఇంటెలిజెన్స్కు ఎందుకు రాలేదని అడిగారు. రైల్వే స్టేషన్ కాంపౌండ్ కూల్చివేశారంటే ఎంత పెద్ద ఆయుధాలు వాడి ఉండాలి. కేంద్రాన్ని బదనాం చేసే లక్ష్యంతోనే విధ్వంసం జరిగిందని ఆరోపించారు. కాల్పులు జరిపింది రాష్ట్ర పోలీసులే. శాంతి భద్రతలు కాపాడాల్సింది రాష్ట్ర పోలీసులు. కేంద్ర బలగాలు కాల్పులు జరపలేదు. పెట్రోల్ తీసుకు వచ్చింది ఎవరు? విధ్వంసం చేసింది ఎవరు? దుండగులు పెట్రోల్ పోసి, బాంబులు వేసి, గోడలు కూల్చి వెళ్లిపోయారు. అమాయకులు గాయపడ్డారని సంజయ్ అన్నారు.

ఎందుకు స్పందించలే
కేటీఆర్ ఆదేశాలు ఇచ్చేవరకు పోలీసు యంత్రాంగం ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ అడిగారు. మృతుడి కుటుంబానికి అండగా ఉండాలి. సీఎం ఈ విషయంలో వెంటనే స్పందించారు. సునీల్ నాయక్ అనే వ్యక్తి సీఎం పేరు చెప్పి ఆత్మహత్య చేసుకున్నా స్పందించలేదు. ఆయన అంతిమయాత్రలో అనుమతి ఎందుకు ఇవ్వలేదు. టీఆర్ఎస్ అంతిమయాత్ర పేరుతో కేంద్ర సంస్థలపై దాడులు చేస్తోందని విరుచుకుపడ్డారు. రాష్ట్ర పోలీసులు కాల్పులు జరిపితే, కేంద్రంపై బురద చల్లడం సిగ్గుచేటని సంజయ్ అన్నారు. 'అగ్నిపథ్' గొప్ప పథకం. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలి. ఆర్మీ రిక్రూట్మెంట్కు దీనికి సంబంధం లేదని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

యూపీలో యోగి చేశారా..?
సికింద్రాబాద్ విధ్వంసం వెనుక టీఆర్ఎస్ ఉందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. సికింద్రాబాద్లో టీఆర్ఎస్ నిరసన చేయిస్తే.. ఉత్తరప్రదేశ్ లో ఓ పోలీస్ స్టేషన్ పైనే ఆందోళనకారులు దాడిచేశారని గుర్తుచేశారు. ఆ దాడిని అక్కడి సీఎం యోగి ఆదిత్యనాథ్ చేయించారా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. బీహార్లో నిరసనకారులు రైల్వేస్టేషన్లపై దాడి చేశారని, ఆ దాడులు సీఎం నితీశ్ చేయించారా? అని నిలదీశారు. ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటున్న బీజేపీ, ఆఖరికి సైన్యాన్ని కూడా ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. ఆర్మీ ఉద్యోగాలను సైతం యువతకు దూరం చేస్తున్న కేంద్రం, అగ్నిపథ్ నియామక విధానం యువతకు అర్థం కాలేదని అనడం సరికాదని కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications