వేములవాడ రాజన్న ఆలయంలో రేపట్నుంచి 5రోజులపాటు శివ కళ్యాణ మహోత్సవాలు
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి శివ కళ్యాణోత్సవాలు జరగనున్నాయి.
కరీంనగర్: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి శివ కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. మార్చి 9 నుంచి ఐదురోజులపాటు అంటే మార్చి 13 వరకు ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
శివ కళ్యాణోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహంచేందుకు అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలో యాగశాలను సిద్ధం చేస్తున్నారు. మిగితా ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమయ్యారు. శివకళ్యాణోత్సవానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 50 వేల నుంచి లక్ష మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వేములవాడ ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. తాగునీటి వసతితోపాటు భక్తులు ఉత్సవాలను తిలకించేందుకు ప్రాంగణంలోని ఓపెన్ శ్లాబ్, ఆలయ ప్రధాన ద్వారం, ఈవో కార్యాలయం తదితర ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని వివరించారు.
ముగిసిన త్రిరాత్రి ఉత్సవాలు
వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న త్రిరాత్రి ఉత్సవాలు మంగళవారం రాత్రి ముగిశాయి. శివకళ్యాణ మహోత్సవాలకు ముందుగా మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భాగంగా చివరిరోజైన మంగళవారం రాజరాజేశ్వరస్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపంలోని ఊయలలో ఉంచి డోలోత్సవం నిర్వహించారు.












Click it and Unblock the Notifications