టీఆర్ఎస్ గెలుపు ఖాయం: తాజా సర్వేలంటూ హరీశ్ రావు, ఈటల రాజేందర్, బీజేపీపై నిప్పులు
కరీంనగర్: హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని తాజా సర్వేలో తేలిందని తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ను గెలిపిస్తాయన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట గాంధీ చౌరస్తాలో ఉప ఎన్నిక ప్రచారంలో హరీశ్ రావు పాల్గొన్నారు. గోబెల్స్ ప్రచారంతో గెలవాలని బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు.

ఈటల పట్టపగలు పచ్చి అబద్ధాలంటూ హరీశ్ రావు ఫైర్
ఢిల్లీ నుంచి వచ్చిన మంత్రులు ఏం చేస్తారో చెప్పాలని తన్నీరు హరీశ్ రావు డిమాండ్ చేశారు. అక్టోబర్ 30వ తేదీ తరువాత గ్యాస్ ధర రూ. 200 వరకు పెంచుతారట అని హరీశ్ అన్నారు. గ్యాస్ ధర పెంచం, సబ్సిడీ ఇస్తాం అని చెప్పి ఓట్లు అడగాలని ఆయన కేంద్ర మంత్రులను డిమాండ్ చేశారు. ఉజ్వల్ పథకం కింద గ్యాస్ సిలిండర్ ఇచ్చారని.. నెలనెలా గ్యాస్ ధరలు పెంచారని విర్శించారు. సబ్సిడీలు ఎత్తేశారని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. ఈటల రాజేందర్ పట్ట పగలు పచ్చి అబద్దాలు చెబుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ఈటల రాజేందర్కు ఆత్మగౌరవం ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఆత్మగౌరవం కల్పించింది సీఎం కేసీఆర్ అని హరీష్ రావు గుర్తు చేశారు. బీజేపీలో చేరి హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది ఈటల రాజేందర్ అని విమర్శించారు. టీఆర్ఎస్ను వీడి ఢిల్లీ పెద్దల ముందు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు.

సీఎం కేసీఆర్ సభ జరిగితే వార్ వన్ సైడే.. : హరీశ్ రావు
రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి, పింఛన్లను తాము నమ్ముకున్నామని హరీశ్ రావు తెలిపారు. కేంద్ర నిధులపై విసిరిన సవాలుకు బీజేపీ నేతల వద్ద సమాధానం లేదన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత గ్యాస్ ధరలు మరింతగా పెరుగుతున్నాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. సీఎం సభ ఇక్కడ జరిగితే వార్ వన్ సైడ్ అయ్యే అవకాశాలున్నాయని, ఎన్నికల కమిషన్తో కుమ్మక్కై ఆయనను రాకుండా చేసిన్రు.. ఎన్ని రోజులు మీరు ముఖ్యమంత్రిని హుజూరాబాద్కు రాకుండా ఆపగలరు.. గెల్లు గెలిచిన రెండు వారాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్కు వచ్చి స్వయంగా ఆయనే మెడికల్ కాలేజీ ప్రకటన చేస్తారు.. అలాగే, హుజూరాబాద్కు వరాల జల్లును కురిపిస్తారని మంత్రి హరీశ్రావు ప్రకటించారు.
Recommended Video

హుజూరాబాద్లో కేసీఆర్ వరాలంటూ హరీశ్ రావు
నాగార్జునసాగర్లో జానారెడ్డిపై నోముల భగత్ గెలవగానే ఇచ్చిన మాట ప్రకారం నాగార్జునసాగర్కు వెళ్లి అక్కడ అంతకు ముందు ఇచ్చిన హామీలైన నీటి లిఫ్టులు, ఇతర అభివృద్ధి పథకాలను మంజూరు చేసి వచ్చారని గుర్తు చేశారు. జమ్మి కుంట ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా మారిన రైల్వే బ్రిడ్జిని ప్రజల కోరిక మేరకు తీసేసి, మరొకటి కట్టించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. దళితబంధును ఆపింది ముమ్మాటికీ బీజేపీ నేతలేనని హరీశ్ రావు ఆరోపించారు. దళితబంధుపై ప్రేమేందర్ రెడ్డి ఈసీకి లేఖ రాశారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని కేంద్రంపై హరీశ్ రావు మండిపడ్డారు. గెల్లు శ్రీనివాస్ను గెలిపించండి అని హుజూరాబాద్ ప్రజలను కోరారు. ఆక్టోబర్ 30న జరిగే పోలింగ్లో గెల్లు శ్రీనివాస్ను కారు గుర్తుకు ఓటేసి భారీ మోజార్టీతో గెలిపించాలని హరీశ్ రావు కోరారు.












Click it and Unblock the Notifications