పెద్దపల్లి ఎన్నికలు..! ఎటువైపు ఓటర్లు?

కరీంనగర్ : పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం ఆది నుంచి కాంగ్రెస్ కంచుకోట. మధ్యలో టీడీపీ ప్రభంజనం కనిపించినా.. రానురాను ఆ పార్టీ జాడ లేకుండా పోయింది. బీజేపీ మాత్రం ఇంతవరకు బోణీ కొట్టలేదు. 1962 నుంచి 2009 వరకు కాంగ్రెస్ అభ్యర్థులే అత్యధికంగా గెలుపొందారు. 2014 లో తెలంగాణ ఉద్యమ నేపథ్యం కారణంగా కారు జోరు కొనసాగింది. ఈ సెగ్మెంట్ లో పెద్దపల్లి, చెన్నూర్ SC, బెల్లంపల్లి SC, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి SC, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
ఇక్కడి ఓటర్లు విలక్షణ తీర్పు ఇస్తారనే పేరుండటంతో ఈసారి ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది చర్చానీయాంశంగా మారింది.

 కాంగ్రెస్ కంచుకోట.. ఈసారి ఎవరి పీట?

కాంగ్రెస్ కంచుకోట.. ఈసారి ఎవరి పీట?

ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గం.. 1952, 1957లో కరీంనగర్‌ ద్విసభ్య లోక్‌సభగా ఉండేది. ఆ రెండుసార్లు పీడీఎఫ్‌ అభ్యర్థి ఎంఆర్‌. కృష్ణ విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1962, 1967లో మళ్లీ గెలుపొందారు. అలా మొత్తం నాలుగుసార్లు పెద్దపల్లి ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. 1971 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా తులసీరామ్‌ పోటీ చేశారు. అప్పటి తెలంగాణ ఉద్యమ ప్రభావంతో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ ఎంఆర్‌.కృష్ణ గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఉండేది కాదు. దాంతో తులసీరామ్ భారీ మెజార్టీతో గెలుపొందారు.

1982లో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకోవడంతో.. 1984లో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో పెద్దపల్లి ఓటర్లు సైకిల్ గుర్తుపై పోటీ చేసిన గొట్టె భూపతికి పట్టం కట్టారు. 1989, 1991, 1996 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున జి.వెంకట స్వామి హ్యాట్రిక్ కొట్టారు. అనంతరం 1998, 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ సుగుణకుమారిని గెలిపించారు. 2004లో మళ్లీ జి.వెంకటస్వామి గెలిచారు. 2009లో ఆయన తనయుడు జి.వివేకానంద విజయం సాధించారు. 2014లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ విజయం సాధించారు.

ఆ ఇద్దరూ హ్యాట్రిక్ ఎంపీలే..!

ఆ ఇద్దరూ హ్యాట్రిక్ ఎంపీలే..!

పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్ లో ఇద్దరు నేతలు హ్యాట్రిక్ ఎంపీలుగా పనిచేశారు. కరీంనగర్-పెద్దపల్లి ద్విసభ్య లోక్‌సభగా ఉన్న సమయంలో పీడీఎఫ్ పార్టీ నుంచి ఎంఆర్ కృష్ణ 1952,1957లో రెండుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంటరీగా విడిపోయాక మళ్లీ 1962,1967లో గెలుపొందారు. అలా ఆయన నాలుగుసార్లు పెద్దపల్లి ఎంపీగా వ్యవహరించారు.

1989, 1991, 1996లో జరిగిన ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు జి.వెంకటస్వామి. 1998, 1999లో ఆయన హ్యాట్రిక్ విజయాలకు గండి కొట్టారు టీడీపీ అభ్యర్థి డాక్టర్ సుగుణకుమారి. తిరిగి 2004లో సుగుణకుమారిపై మళ్లీ గెలిచారు వెంకటస్వామి.

2014 పోరు.. వందల కోట్లు, వందల కేసులు..!

2014 పోరు.. వందల కోట్లు, వందల కేసులు..!

పెద్దపల్లి లోక్‌సభకు 2014లో జరిగిన ఎన్నికలను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వ్యాపారవేత్త, సీనియర్ లీడర్ ఒకవైపు.. విద్యార్థి నాయకుడు మరోవైపు బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ నుంచి వెంకటస్వామి అలియాస్ కాకా తనయుడు జి.వివేకానంద నిలబడితే.. టీఆర్ఎస్ నుంచి విద్యార్థి ఉద్యమ నాయకుడు బాల్క సుమన్ పోటీ చేశారు.

అయితే వందల కోట్లున్నా వివేకానందను గెలిపిస్తారా? తెలంగాణ కోసం ఉద్యమించి వందల కేసులు నమోదైన తనను గెలిపిస్తారా అంటూ నిర్వహించిన ప్రచారం బాల్క సుమన్ కు కలిసొచ్చింది. అంతేకాదు మలిదశ ఉద్యమంలో భాగంగా కారు జోరు కూడా కొనసాగడంతో వివేకానందపై 2 లక్షల 91 వేల 158 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పెద్దపల్లి ఎంపీ పదవికి రాజీనామా చేశారు సుమన్.

2019 బరి.. గెలిచేదెవరు మరి?

2019 బరి.. గెలిచేదెవరు మరి?

ఈసారి పెద్దపల్లి లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ నుంచి వివేకానందకు టికెట్ దక్కుతుందని మొదటి నుంచి ప్రచారం జరిగినా.. చివరకు గులాబీ బాస్ హ్యాండిచ్చారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన వెంకటేశ్ ను అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. ఆయనకు పెద్దపల్లి టికెటిచ్చి అందర్నీ విస్మయానికి గురిచేశారు. ఇక కాంగ్రెస్ నుంచి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీమంత్రి ఏ.చంద్రశేఖర్ ను రంగంలోకి దింపారు. అటు బీజేపీ నుంచి మాజీ జర్నలిస్ట్ సోగుల కుమార్ తలపడుతున్నారు. కోల్ బెల్ట్ ఏరియాలో పట్టున్న నాయకుడిగా ఈయనకు పేరుంది.

పెద్దపల్లి పార్లమెంటరీ పరిధిలో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉంటారు. ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకంగా మారుతాయి. అయితే సింగరేణి ప్రాంతంలో కొత్త రైళ్లతో పాటు వ్యాపార అవసరాల కోసం గూడ్స్ కంటెయినర్స్ పెంచాలనే డిమాండ్ బాగా వినిపిస్తోంది. గోదావరి నది పక్కనే ఉన్నా.. రామగుండం ప్రాంతవాసులను తాగునీటి సమస్య వేధిస్తోంది. అదలావుంటే హార్టికల్చర్ యూనివర్సిటీతో పాటు కేంద్రీయ విద్యాలయాలను తీసుకురావాలనేది ఇక్కడి ప్రజల ఆకాంక్ష. అయితే ఈసారి పెద్దపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్ పరిస్థితి చిత్రవిచిత్రంగా ఉంది. సిట్టింగులు, మాజీలు (ఇదివరకు ఈ స్థానంలో గెలిచినవారు) లేకుండా తొలిసారిగా కొత్తముఖాలు తెరపైకి వచ్చాయి. మొత్తానికి విజయావకాశాలపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా.. చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+