గోదారి ఉగ్రరూపం: పర్ణశాలలో మునిగిన సీతమ్మ విగ్రహం, స్వామి వారి సింహాసనం
తెలంగాణలో క్షణం తీరిక లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కాసేపు తగ్గాక ముసురు ఉంటుంది. తర్వాత జోరు వాన కురుస్తోంది. దీంతో వాగులు, చెరువులు నిండుతున్నాయి. భారీ వర్షాలతో భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉప్పొంగుతోంది.
ఉదయం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. పర్ణశాలలో స్వామివారి నార చీరల ప్రాంతం పూర్తిగా నీటమునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతుండటంతో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులను, నేతలను సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు. బాల్కొండ నియోజక వర్గం, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో నేపథ్యలో తక్షణమే పర్యవేక్షించాలని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని ఆదేశించారు.
వర్షాలతో ఇప్పటికే నిర్మల్ నీటి మునిగింది. అక్కడికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తక్షణమే పంపాలని సీఎస్ సోమేశ్ కుమార్ను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ అధికారులు, ఆర్అండ్బీ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలందరూ ఇళ్లలోంచి బయటకు రావద్దని సూచించారు.