పెళ్లయిన 2 నెలలకే.. భార్యను హత్య చేసిన భర్త... విషయం తెలిసి ప్రియురాలి ఆత్మహత్య...
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లయిన రెండు నెలలకే భార్యను కడతేర్చాడో దుర్మార్గుడు. ప్రియురాలి మోజులో పడి భార్యను వదిలించుకునేందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. హత్యానంతరం దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు చాలానే ప్రయత్నాలు చేశాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడక తప్పలేదు. మరోవైపు ఈ హత్య గురించి తెలిసి అతని ప్రియురాలి కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

అసలేం జరిగింది...
ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన నవ్య రెడ్డి (22) బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన నవ్య మేనమామ కుమారుడు నాగశేషు బీటెక్ పూర్తి చేసి పుణేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇరువురి కుటుంబాలు మాట్లాడుకుని రెండు నెలల క్రితం నవ్య-నాగశేషులకు వివాహం జరిపించారు. ఇద్దరూ ఇష్టపూర్తిగానే వివాహం చేసుకున్నారు. అయితే నాగశేషుకు పెళ్లికి ముందు నుంచే మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. నవ్యను పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రియురాలికి దూరం కాలేక సతమతమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆఖరికి భార్యనే కడతేర్చాడు.

కాలేజీలో దిగబెడుతానని చెప్పి...
ప్రస్తుతం బీటెక్ చదువుతున్న నవ్య రెడ్డి ఇటీవల క్లాసులు ప్రారంభం కావడంతో ఇంటి వద్ద నుంచే రోజూ కాలేజీకి వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 3న నాగశేషు రెడ్డి భార్యను కాలేజీలో దిగబెడుతానని నమ్మించి బైక్పై ఎక్కించుకొని బయలుదేరాడు. మార్గమధ్యలో పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి గ్రామ శివారులోని కుక్కలగుట్ట వద్దకు రాగానే బైక్ ఆగాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం మత్తు మందు కలిపిన నీళ్లను ఆమెతో తాగించాడు. ఆ వెంటనే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం...
నవ్య రెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో నాగశేషు ఆమెను సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లాడు. చున్నీతో ఆమె మెడకు ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అనంతరం నవ్య రెడ్డి సెల్ఫోన్ నుంచి ఆమె తండ్రికి మెసేజ్ పెట్టాడు. 'డాడీ.. బ్యాక్ లాగ్స్ సబ్జెక్టుల కారణంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను..' అని మెసేజ్ పంపించాడు. అలా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.ఆ తర్వాత ఏమీ తెలియనట్లు ఎర్రపాలెం పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రియురాలు...?
పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు జరిపారు. భార్య నవ్యను నాగశేషే బైక్పై తీసుకెళ్లినట్లు అందులో రికార్డయింది. దీంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించడంతో నేరం అంగీకరించాడు. ప్రియురాలి మోజులో పడి హత్యకు పాల్పడినట్లు చెప్పాడు. అయితే హత్య విషయం తెలిసి అతని ప్రియురాలి కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లయిన రెండు నెలలకే భర్త చేతిలోనే తమ బిడ్డ హత్యకు గురవడంతో నవ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.












Click it and Unblock the Notifications