తుమ్మల ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య దారుణ హత్య
ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు, టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య సోమవారం దారుణ హత్యకు గురయ్యారు. ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లిలో బైక్పై ఆయన వెళుతుండగా.. కొందరు దుండగులు ఆటోతో ఢీకొట్టారు. ఆ తర్వాత కృష్ణయ్యను ఆరుగురు వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు.
తెల్దారుపల్లి శివారులోని రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. రాజకీయ కక్షలే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కాగా, కృష్ణయ్య ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం డైరెక్టర్గా ఉన్నారు.
అయితే, కృష్ణయ్య హత్యకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వరరావు కారణమంటూ తెల్దారుపల్లికి చెందిన పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేగాక, కోటేశ్వరరావు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంట్లోని ఫర్నీచర్, కిటికీలు ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినా వారు వెనక్కి తగ్గలేదు.
కృష్ణయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. తనను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయని ఇప్పటికే కృష్ణయ్య పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడని ఆయన బంధువులు చెబుతున్నారు.