దొరల పాలన వద్దు.. రాజన్న పాలన ముద్దు: షర్మిల
కొత్త పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల కదనరంగంతో దూసుకెళ్తున్నారు. నేతలతో వరసగా సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఇటు అభిమానులు/ శ్రేణులతో మంతనాలు జరుపుతున్నారు. ఖమ్మం జిల్లా అభిమానులతో వైఎస్ షర్మిల ఇవాళ సమావేశం అయ్యారు. చరిత్రలో జరగని విధంగా ఖమ్మం సభ జరగాలని షర్మిల అన్నారు.
పార్టీ విధివిధానాలపై ఖమ్మం సభలోనే ప్రకటిస్తామని షర్మిల పేర్కొన్నారు. వైఎస్కు రెండు ప్రాంతాలు.. రెండు కళ్లలా ఉండేవి అని తెలిపారు. రాజన్న సంక్షేమ పాలన కోసమే ముందుకొచ్చానని షర్మిల చెప్పారు. షర్మిలమ్మ రాజ్యం కోసం తాను రాజకీయాల్లోకి రావడం లేదని వెల్లడించారు. దొరల కుటుంబ పరిపాలన పోవాలని, రాజన్న పాలన రావాలని అభిమానులతో జరిగిన సమావేశంలో వైఎస్ షర్మిల అన్నారు.
తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలని షర్మిల అంటున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీ లేదని.. అందుకోసమే పార్టీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆమె పార్టీ ఏర్పాటు ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అధికార టీఆర్ఎస్ గుండెల్లో గుబులు రేపుతోంది. పైకి మాత్రం అదేం లేదు అని అంటున్నారు. లోన మాత్రం కాస్త భయపడుతోంది.