వసంత వ్యాఖ్యల దుమారం, సీన్లోకి కొడాలి, జగన్కు విధేయుడిని: కృష్ణ ప్రసాద్
మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ అగ్గిరాజేసింది. అదీ కూడా కాకతీయ సేవా సమితి వన సమారాధాన కార్యక్రమంలో పాల్గొని కామెంట్ చేశారు. దీనిని మాజీ మంత్రి కొడాలి నాని తప్పుపట్టారు. దీంతో నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.

ఓహ్.. నో
నాగేశ్వరరావు (నాన్న) చేసిన వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన సమయంలో జగన్మోహన్ రెడ్డిని ఎంతమంది పొగిడారు? యూనివర్సిటీ పేరు మారిస్తే విమర్శించే హక్కు ఎవరిచ్చారు? అని అడిగారు. ఇదీ తన వ్యక్తిగత అభిప్రాయం అని తెలిపారు. రాజధాని విషయంలో సీఎం జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యం అని వివరించారు. ఏ సామాజిక వర్గానికి ప్రాదాన్యత కల్పించాలనేది ముఖ్యమంత్రి నిర్ణయం అని.. రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ప్రవర్తించాలని సూచించారు.

ఆపలేం
..
వాగే నోరు,తిరిగే కాలు ఆగదన్నట్టు నాన్నను ఆపలేమని తెలిపారు. చిన్న తనంలో నాన్న మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు చెడ్డ పేరు తేకూడదనే విధంగా ప్రవర్తించేవారిమని గుర్తుచేశారు. ఆయన కామెంట్స్ వైఎస్ఆర్ అభిమానులు పట్టించుకోవద్దని కోరారు. 175 మందితో అసెంబ్లీలో కూర్చునే అవకాశం కల్పించిన సీఎం జగన్తోనే తన ప్రయాణం అన్నారు.

లక్ష్యం నెరవేరింది
మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుని ఓడించాలనే ఆకాంక్ష సీఎం జగన్ వల్ల నెరవేరిందన్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయమంటే చేస్తా,లేకుంటే పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. రాజకీయాల్లో అత్యాశ,దురాశ ఎక్కువైపోయిందన్నారు. అవకాశం ఇచ్చి గెలిపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ప్రజలను కానీ విమర్శించనని తెలిపారు. జోగి రమేష్తో విభేదాల విషయంలో అధిష్టానంతో చర్చించిన తర్వాతే మీడియాతో మాట్లాడుతానని తెలిపారు.

అప్పుడు ఏం చేశారు..?
ఇటు కామెంట్స్పై కొడాలి నాని స్పందించారు. కమ్మ సంఘం సమావేశాల్లో వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదన్నారు. గత టిడిపి హయంలో మైనార్టీ , ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని తెలిపారు. కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఇవ్వలేదనడం సరికాదని తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే పదవులు కేటాయించాలని కోరారు. కమ్మ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందే ఉందన్నారు. ఎన్టీఆర్ను కమ్మ వర్గానికి మాత్రమే పరిమితం చేయడం సరికాదని సూచించారు. భారత రత్న తేవడంలో విఫలమైన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించారని అడిగారు.












Click it and Unblock the Notifications